logo

వెలుగులోకి... నకిలీలలు!

ఒకరికి బదులు ఇంకొకరు ఉద్యోగం చేస్తారక్కడ. అసలు పనేమీ చేయకున్నా తమకున్న పలుకుబడితో ప్రతినెలా వేతనం పొందేవారున్నారు. ఒక విభాగంలోనయితే నెలలకొద్దీ ఒక్కరూ సెలవు పెట్టనట్టు రిజిస్టర్‌లో చూపారు.

Published : 21 Mar 2023 02:53 IST

సంగారెడ్డి పురపాలికలో నిర్వహించిన విచారణలో కొన్ని బహిర్గతం
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

వివరాలు సేకరిస్తున్న కమిషనర్‌ చంద్రశేఖర్‌

కరికి బదులు ఇంకొకరు ఉద్యోగం చేస్తారక్కడ. అసలు పనేమీ చేయకున్నా తమకున్న పలుకుబడితో ప్రతినెలా వేతనం పొందేవారున్నారు. ఒక విభాగంలోనయితే నెలలకొద్దీ ఒక్కరూ సెలవు పెట్టనట్టు రిజిస్టర్‌లో చూపారు. స్థానికంగా ఉంటే తప్ప చేయలేని పనులను కొందరు నిత్యం హైదరాబాద్‌ నుంచి చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. సంగారెడ్డి పురపాలికలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సాగిస్తున్న దందా ఇది. ఇదే అంశమై ‘సంగారెడ్డి పురపాలికలో.. నకిలీ ఉద్యోగుల కలకలం’ శీర్షికన ఈనెల19న ‘ఈనాడు’ కథనాన్ని అందించింది. ఈనెల 20న పురపాలిక కమిషనర్‌ చంద్రశేఖర్‌, కౌన్సిలర్ల సమక్షంలో ఒప్పంద ఉద్యోగులందరినీ పిలిచి పూర్తి వివరాలను సేకరించారు. అనుమానంగా ఉన్న పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ అంశమై సమగ్ర విచారణ చేసి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ వెల్లడించారు.

ఆరుగురు ఉద్యోగులు.. అధ్యక్షురాలి బంధువులు

ఈ నకిలీల వ్యవహారంతో సంబంధమున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భారాస కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. కమిషనర్‌ను కూడా బాధ్యుడిని చేయాలన్నారు. తాము ఎన్నో రోజులుగా ఈ అంశమై ఫిర్యాదు చేస్తున్నా జాప్యం చేస్తూ వచ్చారన్నారు. గంజ్‌మైదాన్‌లోని నీళ్లట్యాంకు వద్ద పనిచేస్తున్నానని మేదరి సచిన్‌ అనే యువకుడు ముందుకొచ్చారు. అతడు పురపాలక అధ్యక్షురాలు విజయలక్ష్మి బావ కుమారుడని అక్కడే ఉన్న కౌన్సిలర్లు అధికారులకు తెలిపారు. ఆయనకు సంగారెడ్డి శివారులో హోటల్‌ ఉందన్నారు. ఎప్పుడూ విధులకు రాడని చెప్పారు. ఇలా మరో అయిదుగురు అధ్యక్షురాలికి అత్యంత సమీప బంధువులేనని కమిషనర్‌ చంద్రశేఖర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశమై పురపాలిక అధ్యక్షురాలు విజయలక్ష్మిని అడగ్గా.. వారు పేదలు కావడంతో పురపాలికలో ఉద్యోగాలు చేస్తున్నారని వివరించారు.

ఇష్టారీతిన రాశారు.. దిద్దారు

* వాటర్‌వర్క్స్‌ విభాగంలో మొత్తం 24 మంది పనిచేస్తున్నట్లు రిజిస్టర్‌లో చూపుతున్నారు. 24వ పేరు పి.బాలక్రిష్ణ. ఆయన గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఒక్కరోజు కూడా విధులకు గైర్హాజరు కానట్లు చూపారు. ఆ తర్వాత వాటిని దిద్దారు. ఈ నెలంతా విధులకు రానట్లు చూపించారు. ఈ విషయమై సూపర్‌వైజర్‌ శ్రీనివాసశర్మను అడగ్గా.. కొందరు దిద్దాలని చెప్పడంతోనే తాను అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆయన పురపాలిక అధ్యక్షురాలు విజయలక్ష్మి చెల్లెలి భర్త అని అక్కడే ఉన్న ఇతర కౌన్సిలర్లు తెలిపారు.

* పారిశుద్ధ్య విభాగంలో రికార్డుల్లో ఉన్న మరో పేరు మల్లేశం. ఆయనకు బదులుగా విధులు నిర్వహిస్తున్నానని వీరేశం ఒప్పుకొన్నారు. ఇందుకు తనకు నెలకు రూ.8వేలు ఇస్తున్నారని, మిగతాది మల్లేశం తీసుకుంటారని వివరించారు. 25వ వార్డు కౌన్సిలరు దిడ్డి విజయలక్ష్మి కుమారుడు పవన్‌ కూడా ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది.

* ఒప్పంద పద్ధతిన నీటిసరఫరా విభాగం, ఇతరత్రా ప్రధాన శాఖల్లో పనిచేస్తున్న వారు నిత్యం హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి వారంతా కేవలం రికార్డుల్లో పేర్లు రాసుకొని జీతాలు తీసుకుంటున్న పరిస్థితి. 14వ వార్డులో మూడేళ్లుగా పార్కుకు తాళం వేసే ఉంది. అక్కడా మూడేళ్లుగా ఒకరు పనిచేస్తున్నట్లు రిజిస్టర్‌లో చూపి జీతమిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని