logo

వ్యయప్రయాసలకోర్చి ప్రాజెక్టుల భూసేకరణ

దేశ వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పడిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏడున్నర మీటర్లు ఎగువన ఉన్నాయని, స్వరాష్ట్రంలో బోరుబండ్లు, ఆయిల్‌ ఇంజిన్లు, ఇన్వర్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు, వైండింగ్‌ దుకాణాలు...

Published : 08 Jun 2023 02:04 IST

సాగునీటి ఉత్సవంలో మంత్రి హరీశ్‌రావు

చంద్లాపూర్‌ శివారులో సాగునీటి దినోత్సవంలో నృత్యం చేస్తున్న యువతులు, చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, నాయకులు

సిద్దిపేట, చిన్నకోడూరు, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పడిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏడున్నర మీటర్లు ఎగువన ఉన్నాయని, స్వరాష్ట్రంలో బోరుబండ్లు, ఆయిల్‌ ఇంజిన్లు, ఇన్వర్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు, వైండింగ్‌ దుకాణాలు బందయ్యే పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవని, ప్రస్తుతం బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూలీలు, హమాలీలు ఆ ప్రాంతానికి ఉపాధి కోసం వస్తున్నారని తెలిపారు. నాడు బతకపోయిన పాలమూరుకు నేడు బతకడానికి ఇతరులు వచ్చే స్థితికి చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సిద్దిపేట శివారు రంగనాయకసాగర్‌ జలాశయం మధ్యన సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటవకుంటే, ఉద్యమ నేత కేసీఆర్‌ సీఎం కాకుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు సాధ్యమయ్యేవా అని ప్రశ్నించారు. ఎన్నో గొప్ప అనుభూతులు గుర్తుకొస్తున్నాయని, ఎట్లుండె తెలంగాణ, ఎట్లయిందంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాడు సీడబ్ల్యూసీ, అటవీ, పర్యావరణ అనుమతుల నిమిత్తం కేంద్ర శాఖల వద్ద కింది స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద అధికారి వరకు దస్త్రాలు పట్టుకొని ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులతో సహా తిరిగామన్నారు. వివిధ శాఖల వద్ద ఫైళ్లు పట్టుకొని అటెండర్‌ కూర్చునే బెంచీల వద్ద వేచి చూసే పరిస్థితిని చవిచూశామన్నారు. ప్రజల కోసం స్వార్థం లేకుండా పని చేశామన్నారు. ఆర్‌.విద్యాసాగర్‌రావు లాంటి ఎంతోమంది నీళ్ల కోసం కృషి చేశారని, మార్గదర్శకత్వం వహించారని గుర్తుచేశారు. కాళేశ్వరం నిర్మాణంలో మొత్తంగా 70 వేల ఎకరాల భూమిని సేకరిస్తే జిల్లాలో 38 వేల మేర సేకరించామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత జలాశయంగా మల్లన్నసాగర్‌ నిలిచిందన్నారు. భూసేకరణలో ఎన్నో ప్రయాసలు పడ్డామని, రైతులను వివిధ దశల్లో సముదాయించామన్నారు. ఈ ప్రాంతంలో నాడు వర్షాల కోసం కప్పతల్లి ఆటలు, దేవుళ్ల జలాభిషేకాలు, పూజలు చేసేవారమన్నారు. అత్యద్భుత పర్యాటక కేంద్రంగా రంగనాయకసాగర్‌ మారనుందని, రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. చంద్లాపూర్‌ శివారులో ఎత్తిపోతల పనుల (లిఫ్ట్‌ ఇరిగేషన్‌)కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం నీటి పారుదల శాఖ ఇంజినీర్లను సత్కరించారు. ఈఎన్‌సీ హరిరాం, జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, ఎస్‌ఈ బస్వరాజ్‌, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం తదితరులు ఉన్నారు. అల్లీపూర్‌లో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవం, గంగాపూర్‌లో రేణుక ఎల్లమ్మ, జమదగ్ని కళ్యాణోత్సవానికి మంత్రి హరీశ్‌రావు బుధవారం హజరయ్యారు. ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్‌ ఎంపీపీ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని