logo

మమ్మల్ని వేధించకన్నా.. నీ చెల్లిగా వేడుకుంటున్నా!

స్వాతంత్య్ర దిన వేడుకల సాక్షిగా కోదాడ అధికార పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ తన కుటుంబాన్ని మానసికంగా వేధించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోదాడ పుర ఛైర్‌పర్సన్‌

Updated : 16 Aug 2022 12:01 IST

ఎమ్మెల్యే ఆగడాలపై మంత్రులు జోక్యం చేసుకోవాలి

కన్నీటి పర్యంతమైన కోదాడ పుర ఛైర్‌పర్సన్‌ శిరీష

విలేకరుల సమావేశంలో చెమ్మగిల్లిన కళ్లతో పుర ఛైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష

కోదాడ న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దిన వేడుకల సాక్షిగా కోదాడ అధికార పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ తన కుటుంబాన్ని మానసికంగా వేధించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోదాడ పుర ఛైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష ఆరోపించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పట్టణ ప్రథమ పౌరురాలిగా గుర్తింపు ఇవ్వకుండా కోదాడ ఎంపీపీ, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌తో అవమానపర్చారని ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోరున విలపించారు. ఎమ్మెల్యే పుర పాలక వర్గంలో చీలికలు తెచ్చి, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. అధికార, పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా తమను దూరంగా పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వివరించారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన నాకు భర్త తోడుగా వస్తుంటే అడ్డుకోవడం బాధాకరమన్నారు. ‘‘అన్నా మల్లన్నా నీ సోదరిగా వేడుకుంటున్నా నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయకన్నా’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్లు సుశీల, మాదార్, స్వామి నాయక్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

వివాదానికి కారణమిదే.. 

ఉదయం మున్సిపల్‌ కార్యాలయంలో జెండా ఎగురవేయటానికి ఛైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ వాసులు హాజరయ్యారు. ఉదయం 8:30 గంటలకు జెండా ఆవిష్కరించేందుకు పుర ఛైర్‌ పర్సన్‌ సమాయత్తమవుతున్న సమయంలో ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగాలని పుర కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ లోపు ఎమ్మెల్యే మున్సిపల్‌ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిపోయారు. దారిలోని మున్సిపల్‌ కార్యాలయానికి రాకపోవడంతో అక్కడున్న వారికి కమిషనర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కమిషనర్‌ వ్యవహారశైలిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సమయం దాటినా ఎమ్మెల్యే రాలేదంటూ ఛైర్‌పర్సన్‌ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఆమె అక్కడి నుంచి గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి వెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యే, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ బుర్ర సుధారాణి, కోదాడ ఎంపీపీ కవితారెడ్డి అక్కడి వచ్చారు. వారు లోపలికి వస్తున్న క్రమంలో తనను పక్కకు తోసేసి అవమానించారని పుర ఛైర్‌పర్సన్‌ శిరీష ఆరోపించారు. పట్టణ ప్రథమ పౌరురాలి హోదాలో కార్యక్రమానికి హాజరైతే మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు అవమానకరంగా వ్యవహరించారని విమర్శించారు. మనస్తాపంతో అక్కడి నుంచి గాంధీ విగ్రహం ఎదుట మౌనంగా నిరసన వ్యక్తం చేసి.. ఇంటికి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంపై ఎంపీపీ కవితారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ సుధారాణి మాట్లాడుతూ ఆమె మాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఛైర్‌పర్సన్‌ ముందుండాలంటూ మమ్మల్నే నెట్టుకుంటూ ముందుకు వెళ్లిందన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని