logo

వేసవిలో కూలీలందరికీ ఉపాధి

ఈ వేసవిలో నమోదిత కూలీలందరికీ ఉపాధి కల్పిస్తాం. ఇంకా ఎంత మంది వచ్చినా పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైన పనులు గుర్తించాం.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింది పనులు కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాం.

Published : 24 Mar 2023 04:44 IST

మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో, యాదాద్రి జిల్లా

భువనగిరి, న్యూస్‌టుడే: ఈ వేసవిలో నమోదిత కూలీలందరికీ ఉపాధి కల్పిస్తాం. ఇంకా ఎంత మంది వచ్చినా పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైన పనులు గుర్తించాం.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింది పనులు కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాం. ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించి 109 శాతం పనులు కల్పించామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 32 లక్షల పనిదినాలు కల్పించేందకు ప్రణాళిక రూపొందించాం. పనుల్లో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని, సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే రికవరీలు చేస్తున్నామన్నారు. పనిలో ఉండే కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లకు క్షేత్ర సహాయకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉంచాం.

32 లక్షల పనులు గుర్తించాం..

నమోదిత కూలీలందరికీ ఉపాధి కల్పనకు పనులు గుర్తించాం. జిల్లాలోని 420 పంచాయతీల్లో 32లక్షల పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. వేసవిలో ఎంత మంది కూలీలు వచ్చినా పని చూపిస్తాం. ప్రస్తుతం జిల్లాలో 14,892 మంది కూలీలు పనుల్లో ఉన్నారు. గత ఏడాది ఇదే రోజు 13 వేల మంది మాత్రమే పనికి వచ్చి ఉపాధి పొందారు. మార్చి నెల నుంచి పనికి వచ్చే కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటున్న వారు జాబ్‌ కార్డులు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లో జారీ చేస్తాం. వారికి పని చూపుతాం.జిల్లాలో 2.57లక్షల మంది కూలీల్లో 1.42 లక్షల మంది పనిచేస్తున్నారు.

వంద రోజుల పని..

ప్రతి ఒక్క కూలీకి వంద రోజుల పనిదినాలు కల్పించడమే లక్ష్యం. ఈ ఏడాది 754 కుంటుంబాలకు 100 రోజుల పని కల్పించాం. నీటి నిల్వ, రైతుల భూముల అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. సన్న, చిన్న కారు రైతుల భూముల్లో అభివృద్ధి చేస్తున్నాం. చెట్లు, రాళ్లు తొలగించి భూమి చదును చేయడం వంటి పనులు ఎక్కువగా చేపడుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 16 వేల పనులు పూర్తి చేశాం. వీటిలో చెరువులు, కాలువల్లో పూడిక తీత, చేపల కందకాలు, నీటి సమతల కందకాలు, ఖండిత కందకాలు ఉన్నాయి. రైతులు సద్వినియోగం చేసుకుని తమ భూములను అభివృద్ధి చేసుకోవడంతోపాటు వర్షపు నీటిని సంరక్షణ చర్యలకు ముందుకు రావాలి. 65 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మిస్తున్నాం.

*  నగర శివారులోలని భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం మండలాల్లో ఈ కూలీల కొరత ఎక్కువగా ఉంది. అక్కడి వారిని నచ్చజెప్పి పనికి తీసుకువస్తున్నాం. రోజుకు గరిష్ఠంగా రూ.257 కూలీ లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

*  రాష్ట్ర సాఫ్ట్‌ వేర్‌ నుంచి నరేగా సాఫ్ట్‌ వేర్‌లోకి మారాక వేసవి భృతి, మంచినీటికి ఇచ్చే డబ్బులు కూడా నిలిచిపోయాయి. కలెక్టర్‌తో మాట్లాడి పనిప్రదేశాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని