logo

పునరావాసంలోనూ డొల్లతనమే..

జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సిద్ధం చేస్తున్న పునరావాస కాలనీల్లో నిర్మాణ పనులు తీసికట్టుగా ఉన్నాయి.

Published : 29 Nov 2022 02:17 IST

కోమటికుంట వద్ద కాలనీలో నాసిరకం నిర్మాణాలు
వెలిగొండ నిర్వాసితుల ఆవేదన
మార్కాపురం, న్యూస్‌టుడే

పునరావాస కాలనీలో నాసిరకం కంకరతో నిర్మించిన సీసీ రహదారి

జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సిద్ధం చేస్తున్న పునరావాస కాలనీల్లో నిర్మాణ పనులు తీసికట్టుగా ఉన్నాయి. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తండా ముంపు గ్రామాల నిర్వాసితులకు వేములకోట పంచాయతీలోని కోమటికుంట వద్ద 84 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. 850 ఆవాసాలు నిర్మించాల్సి ఉంది. ఇంకా ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు. ప్రస్తుతం వివిధ సౌకర్యాల కోసం చేస్తున్న పనుల్లో డొల్లతనం బయటపడుతుంది.

పనుల కోసం భారీగా నిల్వ చేసిన నాణ్యత లేని కంకర

పునరావాస కాలనీలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక భవనం, దేవాలయం తదితరాలతో పాటు సీసీ రహదారులు నిర్మించాల్సి ఉంది. వీటికి నాణ్యతతో కూడిన చీమకుర్తి కంకర వినియోగించాల్సి ఉంది. గుత్తేదారులు మాత్రం పెద్దారవీడు మండలం కలనూతల గ్రామం వద్ద ఉన్న కొండరాయి కంకర తెచ్చి వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు కాలనీలో నిర్మాణం చేసినవాటికి దీనినే వాడారు. కొన్నాళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయి. ఇటీవల నిర్వాసితుల సమస్యలపై ‘ఈనాడు’ వరుస కథనాలు వెలువరించడంతో గత వారం రోజులుగా మళ్లీ ఆరంభించారు. నాసిరకం కంకర వాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన సీసీ రహదారులకు వాడేదీ ఇదే. దీనివల్ల వాహనాలు వచ్చినప్పుడు కుంగిపోయే ప్రమాదం ఉందని రెండు గ్రామాల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెల్లువెత్తిన ఫిర్యాదులు

గొట్టిపడియ, అక్క చెరువుతండా గ్రామస్థులు నివసించాల్సిన ఈ పునరావాస కాలనీలో ఇప్పటివరకు నాణ్యత లేని కంపెనీల సిమెంట్‌, ఇనుముతో పాటు మట్టితో కలిసిన ఇసుక, పూర్తిగా కొండ కొంకర ఉపయోగిస్తున్నారనేది నిర్వాసితుల ఫిర్యాదు. ఇటీవల వారంతా జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జేసీ కంకరను మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా వారికి పట్టలేదు. ఇప్పటివరకు దేవాలయం, పాఠశాల, సామాజిక భవనాల నిర్మాణాలు 45 శాతం జరిగాయి. సీసీ రహదారులు కూడా రెండు లేయర్లు పూర్తయ్యాయి. వీటన్నింటికి రూ.30 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.5.50 కోట్ల బిల్లులు చెల్లించినట్లు ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.


నిబంధనల ప్రకారమే పనులు

ప్రభాకర్‌, ఈఈ, వెలిగొండ ప్రాజెక్టు, కంభం

ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కాలనీలో నిబంధనల ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాణ్యత పరిశీలనకు సామగ్రి సేకరించి ప్రయోగశాలకు పంపిస్తాం.  చీమకుర్తి కంకర అక్కడ తగినంత లభించడం లేదు. రవాణా కూడా సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో కొండ కంకరను సీసీ రహదారులకు అడుగు భాగాన వినియోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో అదే కంకర వాడటంలేదు. వస్తుసామగ్రి అంతా నాణ్యమైనదే. నాసిరకం వాడితే బిల్లులు చేసే పరిస్థితి ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని