logo

ప్చ్‌.. ఫ్యూజులు వేసేవారూ లేరు

ఆధునిక సమాజంలో విద్యుత్తు ఓ నిత్యావసరం. అలాంటి సేవలు అందించే కీలకశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది పోస్టుల భర్తీ ఏళ్లుగా లేకపోయింది.

Updated : 03 Jun 2023 05:14 IST

విద్యుత్తు శాఖలోఖాళీ కుర్చీలు
పోస్టుల భర్తీకి కానరాని చర్యలు
వినియోగదారులకు తప్పని అవస్థలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:

విద్యుత్తు భవన్‌

ఆధునిక సమాజంలో విద్యుత్తు ఓ నిత్యావసరం. అలాంటి సేవలు అందించే కీలకశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది పోస్టుల భర్తీ ఏళ్లుగా లేకపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందనే విమర్శలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కనిపించడం లేదు. ఒక్కో ఉద్యోగి పక్క ప్రాంతాలకు ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా సకాలంలో సేవలు అందటం గగనంగా మారింది. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులే కొద్దిపాటి అవగాహనతో ఎలక్ట్రీషియన్లుగా మారుతున్నారు. అపాయం అయినప్పటికీ.. విద్యుత్తు పరివర్తకాల వద్ద ఫ్యూజు అమర్చడం, లైన్‌ మీద మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

స్తంభాలు ఎక్కేవారే లేరు...: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1989 నుంచి లైన్‌మెన్‌ మాత్రమే స్తంభం ఎక్కాలి. జూనియర్‌ లైన్‌మెన్‌, లైన్‌మెన్‌కు అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ అనుసంధానంగా ఉండేవారు. కాలక్రమేణా 2001లో డిస్కమ్‌లు ఏర్పాటైన తర్వాత నిబంధనలు సడలించారు. అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ కూడా స్తంభం ఎక్కేలా మార్పులు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్‌(జేఎల్‌ఎం-గ్రేడు 2) పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మార్గదర్శకాల ప్రకారం వీరు స్తంభం ఎక్కడానికి లేదు. అత్యవసర సమయంలో వారితో పని చేయించినా ఆ సమయంలో ఊహించని ప్రమాదాలు సంభవిస్తే అందుకు బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

స్థానికంగా ఉండని అసిస్టెంట్లు!...: గతంలో జేఎల్‌ఎం మీటరు రీడింగ్‌ తీయగా.. వారికి పనిభారం రీత్యా ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని జూనియర్‌ లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌కు రెండు లేదా మూడు గ్రామాల చొప్పున విద్యుత్తు సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వినియోగదారుల నుంచే వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చాక ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేశారు. 638 సచివాలయాలకు పోస్టులు మంజూరవగా, అందులో 629 మంది విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు కూడా పనిచేసే చోట నివాసం ఉండటం లేదనే విమర్శలున్నాయి.

సొంత ప్రయత్నాలతో మృత్యువాత...: వేసవి సీజన్‌లో రాత్రివేళ ఏసీల వినియోగం కారణంగా పరివర్తకం మీద లోడు ఎక్కువ పడటంతో తరచూ ఫ్యూజులు పోతున్నాయి. జేఎల్‌ఎం, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌లు అందుబాటులో లేకపోవడం.. ఎనర్జీ అసిస్టెంట్లలో కొందరు స్థానికంగా ఉండకపోవడంతో పల్లెల్లో రాత్రివేళ ఫ్యూజు పోతే వేసేవారు కరవయ్యారు. విధి లేని పరిస్థితుల్లో స్థానికులే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పొలాల్లో పరివర్తకాలు మరమ్మతులకు గురికావడంతో సాగు రైతులు ఫిర్యాదు చేసినా రోజుల తరబడి ముఖం చాటేయడంతో తమకున్న కొద్దిపాటి అవగాహనతో వారు సొంత ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో కొన్నిసార్లు మృత్యువాత పడుతున్న ఉదంతాలూ ఉన్నాయి. అయినా విద్యుత్తు శాఖకు ఖాళీ పోస్టుల భర్తీ ఊసే పట్టడం లేదు.  

ప్రభుత్వానికి నివేదించాం...

జిల్లాలో 36 ఆపరేషన్‌ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాళీల గురించి ప్రభుత్వానికి నివేదించాం. వినియోగదారులకు సేవలు అందించడంలో అంతరాయానికి తావులేకుండా ఉండేందుకు సబ్‌ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం. రైతులు, వినియోగదారులు సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే సిబ్బంది దృష్టికి తీసుకురావాలి. అంతేకానీ వారే స్వయంగా ఫ్యూజులు వేయడం, ఇతరత్రా మరమ్మతులు వంటివి చేయొద్దు.

కేవీజీ.సత్యనారాయణ, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని