logo

వీడని పీఠముడి

వైకాపాలో అంతర్గత రాజకీయం అట్టుడుకుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ పట్టుబడుతున్నారు.

Updated : 29 Mar 2023 12:39 IST

పట్టువీడని ఎమ్మెల్యే.. మెట్టు దిగని ఛైర్‌పర్సన్‌!
అధికార పార్టీలో అట్టుడుకుతున్న వైనం

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే : వైకాపాలో అంతర్గత రాజకీయం అట్టుడుకుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ పట్టుబడుతున్నారు. పురపాలక ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి మాత్రం మెట్టు దిగడం లేదు. ఎమ్మెల్యే మాట నెగ్గుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. 28 వార్డులున్న నర్సీపట్నం పురపాలక సంఘంలో రెండేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు వైకాపా 14 వార్డులను, తెదేపా 12 వార్డులను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకరు, జనసేన నుంచి ఒకరు గెలిచారు. తొలి రెండేళ్లు ఆదిలక్ష్మి, తదుపరి రెండేళ్లు పెదబొడ్డేపల్లికి చెందిన బోడపాటి సుబ్బలక్ష్మి ఛైర్‌పర్సన్లు వ్యవహరిస్తారని ప్రమాణ స్వీకారం రోజున ఎమ్మెల్యే గణేష్‌ బహిరంగంగా ప్రకటించారు. 40 రోజుల కిందట ఎమ్మెల్యే గణేష్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఛైర్‌పర్సన్‌తో రాజీనామా చేయించాలని నిర్ణయించారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అధికార మార్పిడి ప్రక్రియపై దృష్టిసారించలేదు. తాజాగా సోమవారం రాత్రి వైకాపా కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులతో ఎమ్మెల్యే తన నివాసంలో సమావేశమయ్యారు. ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే గణేష్‌ మాట్లాడుతూ ‘ఇప్పటికే రాజీనామా చేయాల్సింది. బుధవారంలోగా చేయాల’ని ఛైర్‌పర్సన్‌కు సూచించారు. ‘అధిష్ఠానం ఆదేశం పాటించాల్సిందే.. లేదంటే ఎలాంటి సహకారం ఉండద’ని కుండబద్దలు కొట్టారు. సమావేశంలో ఆదిలక్ష్మి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఓ లక్ష్యం (విజన్‌)తో ఛైర్‌పర్సన్‌ బాధ్యత తీసుకున్నా. అనుకున్నట్లుగా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లంతా ఎమ్మెల్యే నిర్ణయానికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘మన ఎమ్మెల్యే సౌమ్యుడు. ఇంకో ఎమ్మెల్యే అయితే వేరేగా మాట్లాడి ఉండేవార’ని ఓ వార్డు నాయకుడు స్వరం పెంచి మాట్లాడటంతో ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాన్ని పాటిస్తారా, లేదా అని ఉత్కంఠ మొదలైంది. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేనందున రాజీనామా చేయకపోవచ్చని కొందరు, ఎమ్మెల్యే మాటను ఆమె జవదాటరని మరికొందరు చెబుతున్నారు. నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో మంగళవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా నగదు విడుదల సమావేశానికి ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి హాజరుకాకపోవడంపై ఆ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది.  నెలాఖరున కౌన్సిల్‌ సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలక పరిణామాలు చోటుచేసుకునే ఆస్కారముందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని