logo

ఇక్కడ గుంపులుగా... తిరగొద్దు

వేపగుంట సమీప సర్వేనంబరు 164/1లోని వివాదాస్పద షిప్‌యార్డ్‌ లేఅవుట్‌ స్థలానికి 100 మీటర్ల లోపు టెంట్లు వేసి, శిబిరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ఎస్‌ఐ అసిరితాత హెచ్చరించారు.

Published : 08 Jun 2023 03:27 IST

షిప్‌యార్డ్‌ లేఅవుట్‌ వివాదాస్పద స్థలం వద్ద పోలీసుల హెచ్చరిక
న్యూస్‌టుడే, షిప్‌యార్డ్‌లేఅవుట్‌ (వేపగుంట)

టెంట్లు తొలగించాలని షిప్‌యార్డ్‌ సొసైటీ సభ్యులకు చెబుతున్న ఎస్‌ఐ అసిరితాత

వేపగుంట సమీప సర్వేనంబరు 164/1లోని వివాదాస్పద షిప్‌యార్డ్‌ లేఅవుట్‌ స్థలానికి 100 మీటర్ల లోపు టెంట్లు వేసి, శిబిరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ఎస్‌ఐ అసిరితాత హెచ్చరించారు. గడచిన మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న వివాదాలను దృష్టిలో పెట్టుకుని పెందుర్తి పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో మంగళవారం ప్రశాంతత ఏర్పడింది.

* బుధవారం మళ్లీ షిప్‌యార్డ్‌ సొసైటీ వర్గీయులు టెంట్లు వేసి అందులో కూర్చునేందుకు వచ్చారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. సొసైటీ వర్గీయులతో మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో ఆర్డీవో ఈ వివాదంపై ఒక ప్రకటన చేయనున్నారని అంతవరకు ఎవరూ ఇక్కడ గుంపులుగా ఉండవద్దని స్పష్టం చేశారు. స్థలానికి 100 మీటర్ల దూరంలో ఏ సమావేశమైనా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో పక్కనే ఉన్న పార్కు స్థలం వద్ద విలేకర్లతో మాట్లాడారు. షిప్‌యార్డ్‌ సొసైటీ వర్గీయులు వెళ్లిపోగా డీవీ మహేశ్‌ వర్గీయులు 6 గురు స్థలం లోపల నిర్మాణ దశలో ఉన్న భవనం వద్ద ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారివద్దకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆర్డీవో ఆదేశాల ప్రకారం ఏ ఒక్కరూ ఇక్కడ ఉండకూడదన్నారు. మహిళలు మాట్లాడుతూ ఇక్కడ తమ ఆవులు ఉన్నాయని తాము వెళ్లిపోతే ఎవరు వాటికి మేత వేస్తారని ప్రశ్నించారు. దీనికి ఎస్సై స్పందిస్తూ ఆవులను మేపేందుకు ఇద్దరు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. అంతకు మించి ఇక్కడ ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు.

మహేశ్‌ వర్గీయులతో మాట్లాడుతున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని