logo

కొల్లేరు గొంతెండుతోంది

కైకలూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాల్లో ఆక్వా సాగు విస్తరించడం.. జనాభాకు తగ్గట్టుగా తాగునీటి  చెరువుల విసీతర్ణం పెరగకపోవడం.. నేల స్వభావం  తదితరాలు ఎద్దడికి దారితీస్తున్నాయి.

Published : 09 Jun 2023 05:43 IST

లంక గ్రామాల్లో తీరని నీటి ఎద్దడి
కలిదిండి, కైకలూరు, న్యూస్‌టుడే

కోరుకొల్లులో అడుగంటిన మంచినీటి చెరువు

కైకలూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాల్లో ఆక్వా సాగు విస్తరించడం.. జనాభాకు తగ్గట్టుగా తాగునీటి  చెరువుల విసీతర్ణం పెరగకపోవడం.. నేల స్వభావం  తదితరాలు ఎద్దడికి దారితీస్తున్నాయి.

కొన్నేళ్లుగా కైకలూరు ప్రాంతంలో ఆక్వా సాగు వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కలుషితమై తాగు నీటి చెరువుల్లో నీరు పనికిరాకుండా పోతుంది. మరోవైపు రొయ్యలు, చేపల చెరువుల్లో నీటిని కొందరు నేరుగా పంటకాలువల్లోకి వదిలేయడంతో విషతుల్యంగా మారుతోంది. గ్రామాల్లో అధికశాతం ఫిల్టర్‌ బెడ్లు మరమ్మతులకు గురవడంతో కలుషిత నీటినే నేరుగా కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు.

బావులు, చేతిపంపులపై  పర్యవేక్షణ కరవు..

తాగునీటి చెరువులు కలుషితంగా మారడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు బావులు, చేతిపంపులపై ఆధారపడుతున్నారు. పర్యవేక్షణ కొరవడటంతో బావులు నాచుపట్టి అధ్వానంగా మారాయి. చేతిపంపులు వినియోగంలో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం ఆర్వోప్లాంట్లపై ఆధారపడుతున్నారు.

వింజరం: బావి నుంచి తాగునీరు తీసుకెళ్తున్న స్థానికులు

ఇక్కడ సరిపడా లేక.. నియోజకవర్గంలోని కలిదిండి, కోరుకొల్లు, సానారుద్రవరం, పడమటిపాలెం, పెదలంక, కొండంగి, కొల్లేటికోట, లక్ష్మీపురం, జంగంపాడు, తక్కెళ్లపాడు, చావలిపాడు, కాకతీయనగర్‌, సింగరాయపాలెం, వడాలి, కాకరవాడ, గురజ, దాకరం, పెదపాలపర్రు తదితర గ్రామాల్లో జనాభాకు సరిపడా మంచినీటి చెరువులు లేవు.

ఇదీ పరిస్థితి

కైకలూరు మండలంలోని తామరకొల్లు, వింజరం, వేమవరప్పాడు, రాచపట్నం, సీతనపల్లి, నరసాయపాలెం, దొడ్డిపట్ల్ల, రామవరం, గోపవరం, మండవల్లి మండలంలో చావలిపాడు, కానుకొల్లు, అయ్యవారి రుద్రవరం గ్రామాల్లో ప్రజలకు ఊట బావులే శరణ్యం. కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆటోల్లో తీసుకొచ్చి విక్రయించే నీటిని కొనుగోలు చేసి దప్పిక తీర్చుకోవాల్సి వస్తోంది.

కైకలూరు మండలం పెంచికలమర్రులో ఏర్పాటు చేసిన సామూహిక రక్షిత నీటి పథకం పైపులైన్‌ ఏర్పాటు చేయకపోవడం తదితర కారణాలతో వృథాగా దర్శనమిస్తోంది.
మండవల్లి మండలం తక్కెళ్లపాడులో 14 గ్రామాలకు తాగునీరందించేలా నిర్మించిన సామూహిక నీటి పథకం ప్రస్తుతం రెండు గ్రామాలకు మాత్రమే అందించగలుగుతోంది. ఏడెకరాల చెరువు మాత్రమే ఉండటంతో నీటినిల్వ సామర్థ్యం చాలడం లేదు.

కలిదిండి మండలంలోని చినతాడినాడ, సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ, మద్వానిగూడెం, కొండంగి, మట్టగుంట తదితర ఉప్పుటేరు తీర గ్రామాల్లో ఎద్దడి తీవ్రంగా ఉంది. సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ గ్రామానికి తాగునీరందించేందుకు 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు తవ్వుతున్నారు. ఇది వినియోగంలోకి        వస్తే కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది.

చాటపర్రు రోడ్డులో కుళాయి చెంత నీటి కోసం స్థానికుల పడిగాపులు

చింతపాడులో మరో పథకానికి నిధులు మంజూరైనట్లు అధికారులు ప్రకటించినా నేటికీ పనులు కార్యరూపం దాల్చలేదు. ‘కృష్ణా నది నుంచి కాలువల ద్వారా తాగునీటి సరఫరా సజావుగా సాగుతోంది. ప్రతి గ్రామంలోని మంచినీటి చెరువులు నింపడానికి అవకాశం ఉంది. ఇంటింటికీ కుళాయి మంజూరు చేస్తున్నాం సమస్యలున్నట్లు మా దృష్టికి వస్తే పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం’ అని కైకలూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఎంవీవీఎస్‌ శాస్త్రి తెలిపారు.

నగర శివారు.. నీటికి బేజారు

ఏలూరు నగరపాలకసంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పన్నులు పెరిగినా సౌకర్యాలు కల్పించడం లేదని వారు వాపోతున్నారు. వాటితోపాటు నగరంలోని నల్లదిబ్బ, ఏఎస్సార్‌కాలనీ, లక్ష్మమ్మచెరువు, జలాపహరేశ్వరస్వామి ఆలయం, వెంకన్నచెరువు, అశోకనగర్‌ ఏటిగట్టు, తంగెళ్లమూడి ఏటిగట్టు, పాములదిబ్బ తదితర ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల కుళాయిల నుంచి సన్నని ధార వస్తుంటే.. మరికొన్నిచోట్ల ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆటోలో నీళ్ల డబ్బాలు తీసుకెళ్తూ..

ఈనాడు, ఏలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని