Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jan 2023 13:09 IST

1. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. కోలుకోవాలని ప్రార్థించండి: బాలకృష్ణ

సినీనటుడు తారకరత్న(Taraka Ratna) చికిత్సకు స్పందిస్తున్నారని బాలకృష్ణ(Balakrishna) తెలిపారు. ‘‘తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలి. ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటే మెరుగ్గా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు’’ అని బాలకృష్ణ వెల్లడించారు. తొలిరోజు ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైద్యుల దేశం.. పాల కోసం అలమటిస్తోంది!

ద్వీప దేశమైన క్యూబాలో ప్రస్తుతం అందరి ఆకలి తీరే స్థాయిలో పాలు(milk) లభించడం లేదు. అక్కడ నిత్యం ‘పాలు లేవు.. అయిపోయాయి’ అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. గత ముప్ఫై ఏళ్లుగా క్యూబాలో పాల ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. అక్కడ ఏడాది మొత్తం కలిపి ఒక వ్యక్తికి 39.5లీటర్ల పాలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే రోజుకు సగం గ్లాసు పాలు కూడా అందవు. క్యూబా ప్రధానంగా పాల సరఫరా కోసం న్యూజిలాండ్‌పై ఆధార పడుతోంది. బెల్జియం, ఉరుగ్వే దేశాలు కూడా క్యూబాకు పాలు ఎగుమతి చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను.. ఆ హామీ ఏమైంది?: నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్యావసరాల ధరల భారం మోయలేకపోతున్నామని.. పొదుపు సంఘాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జాయింటుగా గృహ రుణం.. ప్రయోజనాలివే!

చాలా మంది.. జీవితంలో ఒకే ఇంటిని కొనుగోలు చేయగులుగుతారు. రుణం తీసుకుని కొనుగోలు చేస్తే ఇంటి అప్పు తీరేసరికి 20 నుంచి 30 ఏళ్ల సమయం పడుతుంది. అందువల్ల కొనుగోలు చేసే ముందే తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. గృహ రుణాన్ని వ్యక్తిగతంగానే కాకుండా, ఉమ్మడిగా కూడా తీసుకోవచ్చు. ఉమ్మడిగా తీసుకోవడం వల్ల రుణ పరిమితి పెంచుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జూనియర్‌ క్లర్క్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌.. పరీక్ష వాయిదా

గుజరాత్‌ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ క్లర్క్‌ నియామకాల కోసం ఆదివారం జరగాల్సిన పోటీపరీక్ష వాయిదా పడింది. ప్రశ్నాపత్రం లీక్‌ కావడమే దీనికి కారణమని పంచాయతీ పరీక్ష బోర్డు ప్రకటించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మొత్తం 1,181 పోస్టులకుగానూ నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పంచాయతీ బోర్డు తెలిపింది. 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అతడి వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు.. హార్దిక్‌ వ్యూహాలపై పాక్‌ మాజీ ఆటగాడి విమర్శలు

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌(IND Vs NZ)లో టీమ్‌ఇండియా చూపించిన జోష్‌ను.. టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో కొనసాగించలేకపోయింది. అన్ని రంగాల్లో విఫలమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో కెప్టెన్‌ హార్దిక్‌(Hardik Pandya) వ్యూహాలను పాక్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా(Danish Kaneria) తప్పుబట్టాడు. బౌలర్లను మారుస్తూ వైవిధ్యం చూపించడంలో విఫలమయ్యాడని.. అతడి వద్ద ఎటువంటి ప్రణాళికలు లేనట్లు కనిపించాడని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘అది 1962లోనే జరిగింది..’ రాహుల్‌కు జైశంకర్‌ కౌంటర్‌

సరిహద్దుల్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పికొట్టారు. వాస్తవానికి వారు ఆరోపిస్తున్న భూభాగం 1962లోనే ఆక్రమణకు గురైందని తెలిపారు. పరోక్షంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో ఆ భూభాగాన్ని కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందంటూ ఇటీవల కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలకు జైశంకర్‌ పై విధంగా బదులిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒడిశా మంత్రిపై కాల్పులు.. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలింపు

 ఒడిశాలో ఓ మంత్రిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లినట్లు సమాచారం. ఆదివారం రోజు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత మార్కెట్లను వణికిస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌..!

భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో చలిజ్వరం వచ్చినట్లు వణుకుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకొన్నాయి. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా 7వ స్థానానికి పడిపోయాడు. ఇక దేశంలో కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్‌ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చి’ సంస్థ ఇచ్చిన నివేదిక. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని