Gujarat: జూనియర్ క్లర్క్ క్వశ్చన్ పేపర్ హైదరాబాద్‌లో లీక్.. పరీక్ష వాయిదా

గుజరాత్‌లో జరగాల్సిన జూనియర్‌ క్లర్క్ పరీక్ష రద్దయ్యింది. ప్రశ్నాపత్రం లీక్‌ కావడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

Updated : 29 Jan 2023 12:55 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ క్లర్క్‌ నియామకాల కోసం ఆదివారం జరగాల్సిన పోటీపరీక్ష వాయిదా పడింది. ప్రశ్నాపత్రం లీక్‌ కావడమే దీనికి కారణమని పంచాయతీ పరీక్ష బోర్డు ప్రకటించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మొత్తం 1,181 పోస్టులకుగానూ నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పంచాయతీ బోర్డు తెలిపింది. 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,995 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతని వద్ద ప్రశ్నపత్రం లభించినట్లు తెలిపింది. ఆ తర్వాతే పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. త్వరలోనే ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది.

ఈ ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్‌లోనే ముద్రించినట్లు సమాచారం. ఈ మేరకు సదరు ప్రింటింగ్‌ ప్రెస్‌పై కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశ్నపత్రాల లీక్‌ ప్రధాన అంశంగా తెరమీదకు వచ్చింది. ఈ సమస్యను అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ కూడా ఇచ్చారు. తాజాగా ఆయన స్పందిస్తూ.. గుజరాత్‌లోనే ఇలా ఎందుకు జరుగుతుందో? అని ట్విటర్‌ వేదికగా సందేహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని