Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 30 Apr 2024 16:59 IST

1.ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!

 చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా (Coronavirus) వైరస్‌ సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాడు. కొంతకాలంగా ఆ దేశాధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన పనిచేస్తున్న ల్యాబ్‌ నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో చేసేది లేక అదే ల్యాబ్‌ ఎదుట ఆయన నిరసనకు దిగాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. మ్యానిఫెస్టో మీ ముందుపెట్టాం.. ఆశీర్వదించండి: ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

‘రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మేనిఫెస్టోను మీ ముందు పెట్టాం.  తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కూటమి మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పథకాలకు ఎక్కడినుంచి నిధులు వస్తాయని అంటున్నారు. జగన్‌ ఎక్కడి నుంచి తెచ్చారు.. సాక్షి నుంచి తెచ్చారా? భారతి సిమెంట్‌ అమ్మి తెచ్చారా?’’ అని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఆ ఆత్మ వల్లే ‘మహా’ రాజకీయాల్లో అస్థిరత.. శరద్‌ పవార్‌పై ప్రధాని విమర్శలు

ఆయనకు విజయం లభించకపోతే.. ఇతరుల మంచి పనులను కూడా శరద్‌పవార్‌ చెడగొడతారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి ఏమీ చేయలేదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత (Sharad Pawar)పై ప్రధాని (PM Modi) విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం రాణించిన సూచీలు.. గరిష్ఠాల వద్ద మదుపరులు అమ్మకాలకు దిగడంతో ఆఖర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా చివరి అరగంటలో సూచీలు ఒక్కసారిగా భారీగా కుదుపునకు లోనయ్యాయి. దీంతో ఇంట్రాడేలో 22,783.35 వద్ద సరికొత్త గరిష్ఠాలకు అందుకున్న నిఫ్టీ మళ్లీ 22,600 స్థాయికి చేరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!

బంగారం ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది. బలమైన ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) పేర్కొంది. ఆర్‌బీఐ పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా డిమాండ్‌ పుంజుకోవడానికి దోహదం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కేజ్రీవాల్‌ను కలిసిన పంజాబ్‌ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?

మద్యం విధానం కేసులో అరెస్టయి ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal)ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) కలిశారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఇన్సులిన్‌ తీసుకుంటున్నారని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  ‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం

తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసు (Patanjali Row)లో సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈసందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే పతంజలిపై చర్యలు తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?

ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు (Wipro) కొత్త సీఈఓగా శ్రీనివాస్‌ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా అనంతరం కంపెనీ కొత్త సీఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి 2025 జులై వరకు డెలాపోర్టే పదవీకాలం ఉండగా.. ఏడాదిముందే నిష్క్రమించారు. ఈనేపథ్యంలో కొత్త సీఈఓగా పల్లియా బాధ్యతలు స్వీకరించారు. విప్రో కొత్త సీఈఓగా ఏడాదికి నగదు రూపంలో గరిష్ఠంగా 6 మిలియన్‌ డాలర్ల చొప్పున శ్రీనివాస్‌ పల్లియా వేతనం అందుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు