Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Mar 2023 21:28 IST

1. రైతుల తుపాన్‌ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్‌

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, రైతు బీమా ఇస్తూ.. పూర్తిగా పంటను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్‌ రెడ్డి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పేపర్‌ లీకేజీ దుర్మార్గమని మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడిలో అరెస్టయి.. జైలుకు వెళ్లిన భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌తో పాటు మరికొంతమంది నాయకులను కిషన్‌ రెడ్డి చంచల్‌గూడ జైలుకెళ్లి పరామర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపైనే ఆందోళన : అఖిలేష్‌

ఆయా రాష్ట్రాల్లో భాజపాపై పోరాటం చేస్తోన్న ప్రాంతీయ పార్టీలకే జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడిన ఆయన.. సత్యాగ్రహ దీక్ష చేపట్టినందుకు ఆ పార్టీని అభినందించాలని కోరుకుంటున్నానని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రెగ్నెంట్‌ అని తెలీదు.. షూట్‌ వల్ల అబార్షన్‌ అయ్యింది: స్మృతి ఇరానీ

రాజకీయాల్లోకి రాకముందు సినీ నటిగా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టారు భాజపా నేత స్మృతి ఇరానీ (Smriti Irani). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నటిగా తనకు పేరు తెచ్చిపెట్టిన ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’, ‘రామాయణ్‌’ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సీరియల్స్‌లో నటిస్తోన్న రోజుల్లోనే తనకు అబార్షన్‌ అయ్యిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌!

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(wWBC)లో భారత్‌ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ( Women World Boxing Championship) లో భారత్‌ పతకాల వరద పారించింది. ఇప్పటికే మూడు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్న భారత్‌.. తాజాగా మరో పసిడి కొల్లగొట్టింది. నీతు గంగాస్‌, స్వీటీ, జరీనా బంగారు పతకాలు సాధించగా..  తాజాగా 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్‌ (LOVLINA BORGOHAIN)  స్వర్ణాన్ని ముద్దాడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో పావు శాతం వడ్డన తప్పదు.. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుపై నిపుణుల అంచనా

ద్రవ్యోల్బణం ఇంకా ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి కంటే ఎగువనే ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు సైతం కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వచ్చే పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్ల (Interest Rates)ను మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘సండే సరదా.. ఆ విషయాన్ని నేను మర్చిపోతా’

ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సోషల్‌ మీడియా (Social Media)లో ఎంతో చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలతోపాటు హాస్యం పండించే దృశ్యాలు, స్ఫూర్తి నింపే వాక్యాలు వంటివి ఎన్నో నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. ట్విటర్‌లో ఆయనకు సుమారు 10.4 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆదివారం సరదా గురించి ఆయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తైవాన్‌ చైనాలో భాగమే.. హోండురాస్‌ ప్రకటన..!

మధ్య అమెరికా దేశమైన హోండురాస్‌(Honduras ) ద్వీపదేశం తైవాన్‌(Taiwan)కు షాక్‌ ఇచ్చింది. చైనా(China )తో దౌత్య సంబంధాలు పెట్టుకొని ఇప్పటికే తైవాన్‌తో దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని తెంచుకొంది. తమ దేశంతో దౌత్యబంధం కొనసాగించేందుకు హోండురాస్‌ భారీ మొత్తం సొమ్మును డిమాండ్‌ చేసిందని తైవాన్‌ విదేశాంగమంత్రి ఆరోపించడం విశేషం. గత వారం హోండురాస్‌ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించన సమయంలోనే తైవాన్‌తో సంబంధాలు తెంచుకోనుందనే ప్రచారం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత సంతతి చిన్నారి మరణం.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష

భారత సంతతికి (Indian-Origin) చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి మరణానికి కారణమైన యువకుడికి 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికా (America) లూసియానాలో 2021లో జరిగిన ఈ కేసులో న్యాయస్థానం ఇటీవల తీర్పు వెలువరించింది. ఓ హోటల్‌ రూమ్‌లో ఆడుకుంటోన్న చిన్నారి తలకు బుల్లెట్‌ తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు