చంద్రుడిపై చైనా కీలక ప్రయోగం

పొరుగు దేశం చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్‌ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను...

Published : 22 Nov 2020 21:54 IST

బీజింగ్:  చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్‌ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను సేకరించిన తొలి దేశంగా చైనా రికార్డు సృష్టిస్తుంది. చంద్రుని నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన మూడో దేశంగా రికార్డులకెక్కనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యాలు మాత్రమే చంద్రమండలం నుంచి నమూనాలను సేకరించగలిగాయి. చాంగ్-5 పేరిట ఈ మిషన్‌ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో అపోలో మిషన్‌లో భాగంగా అమెరికా 1969 నుంచి 1972 వరకు 382 కిలోల చంద్ర నమూనాలను సేకరించి ప్రయోగాలు చేపట్టింది. మరోవైపు రష్యా కూడా 1970లో చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టి 170 గ్రాముల మట్టిని సేకరించింది. 1959లో రష్యా ప్రయోగించిన లూనా 2 క్రాష్‌ ల్యాండ్‌ కావడంతో ఆ దేశం ప్రయోగాల వేగాన్ని తగ్గించింది. తర్వాతి కాలంలో జపాన్‌, భారత్‌లు కూడా చంద్రుడిపై రోవర్‌లను పంపి ప్రయోగాలు చేపట్టి చివరి దశల్లో విఫలమయ్యాయి.

ఒక వేళ చైనా చేపడుతున్న తాజా ప్రయోగం విజవంతమైతే చంద్రుని పుట్టుక, నీటి నిల్వలు, ఆక్సిజన్‌ స్థాయి తదితర విషయాలపై మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. గతంలో నమూనాలు సేకరించిన ప్రదేశం నుంచి కాకుండా.. ఇతర చోట్ల నుంచి కనీసం 2 కిలోల మట్టి, చంద్ర శిలలను సేకరించాలని చైనా యోచిస్తోంది. గత అన్వేషణల్లో అర్థం కాని విషయాలను గురించి తెలుసుకునేందుకు, చంద్రుడిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం సహకరిస్తుందని బ్రైన్‌ యూనివర్సిటీకి చెందిన జేమ్స్‌ హెడ్‌ వెల్లడించారు. చంద్రుడి జీవిత కాలం, సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ చంద్రుడిపై ఎంతమేర ప్రభావం చూపిస్తోంది? తదితర విషయాలను తెలుసుకునే అవకాశముంటుందని చెప్పారు.

నమూనాలు ఎలా సేకరిస్తారు?
చైనా ప్రయోగించిన చాంగ్‌-5 వాహకనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత.. రిమోట్‌ కంట్రోలింగ్‌ సిస్టమ్‌ సాయంతో రెండు వెహికల్స్‌ని చంద్రుడి ఉపరితలంపై పంపిస్తారు. ల్యాండర్‌ సాయంతో దిగిన ఈ రెండు వాహనాలు నిర్దేశించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపడతాయి. దానికి అమర్చిన అసెండర్‌ ద్వారా శిలలు, మట్టిని సేకరిస్తాయి. ఈ నమూనాలతో వాహకనౌకలోకి చేరుకుంటాయి. చైనా 2013లో తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టింది. 2019లో ఈ దేశానికి చెందిన మానవరహిత  చాంగ్‌-4 చంద్రుడి ఉత్తర ధృవంపై అడుగు పెట్టింది. చంద్రుడి ఉత్తర ధృవాన్ని చేరుకోవడం అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదే ప్రథమం. వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు చేసేందుకు వీలుగా చాంగ్‌ 6, చాంగ్‌ 7, చాంగ్‌ 8 మిషన్ల ద్వారా ఓ బేస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. 2030 నాటికి అంగారకుడి నుంచి నమూనాలను సేకరించేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గత జులైలోనే అంగారకుడిపైకి మానవ రహిత రాకెట్‌ను చైనా ప్రయోగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని