క్రిస్మస్‌ వేడుకలపై కరోనా ప్రభావం 

క్రీస్తు జన్మస్థలమైన బెతెహాం నగరం బోసిపోయింది. రక్షకుడు జన్మించాడంటూ గురువారం ఈ పురవీధుల్లో సంగీతనాదాలు

Updated : 25 Dec 2020 14:38 IST

విదేశీ యాత్రికులు లేక బోసిపోయిన బెత్లెహాం వీధులు

బెత్లెహాం: క్రీస్తు జన్మస్థలమైన బెత్లెహాం నగరం బోసిపోయింది. రక్షకుడు జన్మించాడంటూ గురువారం ఈ పురవీధుల్లో సంగీతనాదాలు వినిపించిన బృందాలకు... చాలా తక్కువ మందే స్వాగతం పలికారు. ఏటా క్రిస్మస్‌ నాడు బెత్లెహాం కిక్కిరిసిపోయేది. కరోనా కారణంగా విమానాల రాకపోకలు రద్దు కావడంతో, ఈసారి వేడుకలకు విదేశీ యాత్రికులు రాలేకపోయారు. మహమ్మారి కారణంగా ఇప్పటికే ఇక్కడి రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి.
‘‘ఎన్నో అవాంతరాలు నెలకొన్నా, వివిధ దేశాల నుంచి పర్యాటకులు రాలేకపోయినా బెత్లెహాంలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తున్నాం. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం’’ అని మేయర్‌ ఆంటోన్‌ సాల్మన్‌ చెప్పారు. బెత్లెహాంలోని క్యాథలిక్‌ పుణ్యక్షేత్రంలో కొద్దిమంది మాత్రమే ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ (85) అబ్బాస్‌ ఈసారి క్రిస్మస్‌ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల క్రిస్మస్‌ వేడుకలకు తక్కువ సంఖ్యలోనే జనం హాజరవుతున్నారు. కొన్నిచోట్ల సామూహిక ఆరాధనలను రద్దు చేయగా, చాలాచోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను ప్రార్థనలకు అనుమతిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని చర్చిల్లో దూరం దూరంగా నిలబడి ప్రార్థనల్లో పాల్గొనడానికి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు. వాటికన్‌లో దాదాపు ఖాళీగా ఉన్న చర్చిలోనే పోప్‌ ప్రార్థనలు నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని