తుపాన్లను మరింత ముందుగా కనిపెట్టొచ్చు

ఉష్ణ మండల తుపాన్లను ముందస్తుగా పసిగట్టేందుకు ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది.

Updated : 10 Jun 2021 14:51 IST

సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందం

దిల్లీ: ఉష్ణ మండల తుపాన్లను ముందస్తుగా పసిగట్టేందుకు ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. తుపాను రావడానికి ముందు సముద్రాల్లో ఏర్పడే సుడిగుండాల ఆనవాళ్లను ఉపగ్రహ చిత్రాల కన్నా ముందుగానే కనిపెట్టడం, తుపాను ఏ ప్రాంతంలో, ఏ సమయంలో సంభవించనుందో గుర్తించడం ఈ విధాన ఉద్దేశం అని శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) తెలిపింది. ఇప్పటివరకూ రిమోట్‌ సెన్సింగ్‌ పద్ధతులే తుపాన్లను వీలైనంత ముందుగా పసిగడుతున్నాయి. అయితే సముద్ర ఉపరితలంపై అల్ప పీడనం అభివృద్ధి చెందాకే ఈ పద్ధతుల్లో తుపాన్ల సంభావ్యతను కనిపెట్టడానికి వీలవుతోంది. తుపానును పసిగట్టడానికి, దాని ప్రభావం మొదలయ్యే సమయానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉంటే సన్నాహక చర్యలను పటిష్ఠంగా చేపట్టడానికి వీలవుతుంది. తుపాను పుట్టుకకు ముందు సుడిగుండాల లక్షణాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటిని తుపాను సంభవించాక ఏర్పడిన పరిస్థితులతో పోల్చి చూడడం ద్వారా ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ నూతన విధానం ద్వారా తుపానుల పుట్టుకను కనీసం నాలుగు రోజుల ముందే అంచనా వేయొచ్చని వారు తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని