Air India: విమానం అత్యవసర ల్యాండింగ్.. మళ్లీ టేకాఫ్‌ చేయనన్న పైలట్‌

అత్యవసరంగా దిగిన ఓ ఎయిరిండియా (Air India) విమానాన్ని మళ్లీ గమ్యస్థానికి చేర్చేందుకు పైలట్‌ నిరాకరించాడు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Updated : 26 Jun 2023 10:55 IST

జైపుర్‌: దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సంస్థకు చెందిన విమానం ఒకటి అత్యవసరంగా జైపుర్‌ (Jaipur)లో దిగింది. అయితే దాన్ని మళ్లీ టేకాఫ్‌ చేసేందుకు పైలట్‌ (Pilot) ససేమిరా అనడంతో కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

లండన్‌ (London) నుంచి బయల్దేరిన ఎయిరిండియా (Air India) ఏఐ-112 విమానం షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అయితే, దిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport) వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో 10 నిమిషాల పాటు అక్కడే గాల్లో చక్కర్లు కొట్టిన విమానాన్ని ఆ తర్వాత రాజస్థాన్‌లోని జైపుర్‌కు దారిమళ్లించారు. దీంతో విమానం జైపుర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది.

అయితే, దాదాపు రెండు గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీ వెళ్లేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) క్లియరెన్స్‌ ఇచ్చింది. కానీ, పైలట్‌ (Pilot) మాత్రం విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం పరిమితులు, పనిగంటలను కారణంగా చూపి తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపుర్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు.

వీరిని గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు గంటల పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కొందరు రోడ్డు మార్గంలో దిల్లీ వెళ్లిపోయారు. ఆ అవకాశం లేనివారు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చివరకు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో కొన్ని గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీ చేరుకుంది. జైపుర్‌లో తాము ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని