Covovax: బూస్టర్‌ డోసుగా ‘కొవోవాక్స్‌’ను అనుమతించండి.. డీసీజీఐకి సీరం విజ్ఞప్తి

సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కొవోవాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసుగా పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఉంది.

Published : 22 Dec 2022 22:29 IST

దిల్లీ: విదేశాల్లో కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా భారత్‌లోనూ మరోసారి కొవిడ్‌ నిబంధనల అమలుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌పైనా నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ‘కొవోవాక్స్‌ (Covovax)’ టీకాను బూస్టర్‌ డోసుగా (Booster Dose) పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (SII) కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి కోరింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండు డోసుల్లో తీసుకున్న వారికి మూడో డోసుగా దీన్ని ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

నొవోవాక్స్‌ (Novavax) సంస్థకు చెందిన కొవోవాక్స్‌ టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి తీసుకురానుంది. కొవోవాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2021 డిసెంబర్‌లోనే అనుమతి ఇచ్చింది. కొవాక్స్‌ (COVAX) కార్యక్రమంలో భాగంగా అల్ప ఆదాయ దేశాల్లో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఆ సందర్భంగా పేర్కొంది. భారత్‌లో తయారై ఐరోపాలో కూడా విక్రయించిన ఏకైక టీకా ఇదేనని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా అప్పట్లో పేర్కొన్నారు. ఈ టీకా 90శాతం కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు.

మరోవైపు భారత్‌లో ప్రికాషనరీ డోసు పేరుతో మూడో డోసునూ (Booster Dose) కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయినప్పటికీ చాలా మంది అర్హులు వ్యాక్సిన్‌ తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం 27శాతం మంది అర్హులు మాత్రమే బూస్టర్‌ డోసు తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా విదేశాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో మూడో డోసు పంపిణీని మరింత ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని