Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 1000 డ్రోన్లతో వెలుగుల జిగేల్‌..!

భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించిన సైనిక, పారామిలిటరీ......

Published : 30 Jan 2022 01:58 IST

దిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించిన సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమం అలరించింది. సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఏటా జరిగే ఈ బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకల్లో ఈసారి పూర్తి స్వదేశీ డ్రోన్‌లతో లేజర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే తొలిసారి 1000 డ్రోన్లతో లేజర్‌షో నిర్వహించారు. ఆకాశంలోకి రివ్వున ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్‌ వెలుగులను విరజిమ్ముతూ ప్రత్యేక ఆకృతుల్లో కనులవిందు చేశాయి. త్రివర్ణ కాంతులతో అబ్బురపరిచాయి. బీటింగ్ రీట్రీట్ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ మువ్వన్నెల కాంతుల్లో ధగధగలాడింది.

ఐఐటీ దిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్‌ డైనమిక్స్‌ అనే అంకుర సంస్థ ఈ డ్రోన్ల షోను రూపొందించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రదర్శన నిర్వహించగా.. ఈ చారిత్రక ప్రదర్శనతో భారత్‌ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల అధిపతులు తదితర ప్రముఖులు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని