Bihar: వృద్ధుడి బ్యాంక్‌ ఖాతాలో ₹52 కోట్లు.. ‘బాబ్బాబు! అంతొద్దు గానీ కొంతైనా ఇవ్వండి ప్లీజ్‌’

Bihar bank account: బిహార్‌లోని ముజఫరాపూర్‌ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి పింఛన్‌ ఖాతాలో రూ.52 కోట్లు జమ అయ్యాయి.

Published : 18 Sep 2021 01:14 IST

పట్నా: బిహార్‌లో సాధారణ పౌరుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు వెల్లువలా వచ్చి పడుతోంది. ఎక్కడి నుంచి ఈ సొమ్ము వస్తోందో తెలీదుగానీ రోజుకో ఘటన వెలుగు చూస్తోంది. ఇదే రాష్ట్రానికి చెందిన కటిహార్‌ జిల్లా బగౌరా పంచాయతీకి చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాలో గురువారం ఏకంగా రూ.960 కోట్లు వెలుగుచూడడం ఆశ్చర్యం కలిగించింది. ఆ ఘటన మరువక ముందే ముజఫరాపూర్‌ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి పింఛన్‌ ఖాతాలో రూ.52 కోట్లు పడడం ఆశ్చర్యం కలిగించింది.

ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా పింఛన్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్‌ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఖాతాలో ఎంతుందో చెక్‌ చేయాలని అక్కడి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ (సీఎస్‌పీ) అధికారిని కోరగా.. ఖాతా చెక్‌ చేస్తే అందులో రూ.52 కోట్లు ఉన్నట్లు చూపించింది. అంతమొత్తం ఉండడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలీదని బహుదూర్‌ షా చెప్పుకొచ్చాడు.

ఇదే తరహాలో పెద్ద మొత్తంలో ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న ఉదంతాలు వెలుగుచూసినప్పుడు ఆయా ఖాతాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. డబ్బు ఉపసంహరించుకోకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో తన ఖాతాలో పడిన సొమ్ములో ఎంతో కొంత తనకిస్తే బతికేస్తానని చెప్పుకొచ్చాడు రామ్‌ బహుదూర్‌ షా. ‘‘వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం సాఫీగా సాగిపోతుంది’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. అంతకుముందు బిహార్‌కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవల పొరపాటున రూ.5.5 లక్షలు జమవగా, తనకు ప్రధాని మోదీ ఇచ్చారంటూ వెనక్కి ఇచ్చేందుకు అతడు నిరాకరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని