AAP Vs BJP: దేశ రాజధానిలో ‘పోస్టర్‌’ వార్‌..!

దేశ రాజధానిలో భాజపా (BJP), ఆప్‌ (AAP) మధ్య మరోసారి ఘర్షణ వాతావరణానికి ప్రధాని మోదీ (Narendra Modi), అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వ్యతిరేక పోస్టర్లు కారణమయ్యాయి. 

Published : 23 Mar 2023 14:15 IST

దిల్లీ: దేశ రాజధానిలో కొంతకాలంగా ఆమ్‌ఆద్మీ పార్టీ (APP), భాజపా (BJP) మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు స్థానిక ఎన్నికలు, నేతలపై కేసుల విషయంలో వివాదం చోటు చేసుకోగా.. తాజాగా అగ్రనేతల పోస్టర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) వ్యతిరేకంగా దిల్లీ వీధుల్లో ఇటీవల పోస్టర్లు వెలిసిన రెండు రోజులకు కేజ్రీవాల్‌ వ్యతిరేక పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘అరవింద్‌ కేజ్రీవాల్‌ హఠావో దిల్లీ బచావో’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి ఫొటోలతో కూడిన పోస్టర్లు కనిపిస్తున్నాయి.

‘మోదీ హఠావో, దేశ్‌ బచావో’ అంటూ దిల్లీలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇటీవల పోస్టర్లు వెలిశాయి. వాటిని తొలగించిన పోలీసులు 130కిపైగా కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే, పోస్టర్లపై ప్రింటింగ్‌ ప్రెస్‌ వివరాలు లేవని.. అందుకే కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని దిల్లీ పోలీసులు వెల్లడించారు. గతంలో మోదీపై పోస్టర్ల విషయంలో ఆప్‌ పోలీసుల చర్యను తీవ్రంగా  వ్యతిరేకించింది.  ఒక్క పోస్టర్‌కే ఎందుకు భయపడుతోందంటూ భాజపాను ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా భాజపా కూడా కేజ్రీవాల్‌ వ్యతిరేక పోస్టర్‌ వార్‌కు దిగింది.

కేజ్రీవాల్‌ ఫొటోతో కూడిన పోస్టర్లు దిల్లీ వీధుల్లో గురువారం దర్శనమిచ్చాయి. భాజపా నేత మంజిందర్‌ సింగ్‌ సిర్సా పేరుతో వీటిని రూపొందించినట్లు సమాచారం. అయితే, ఈ పోస్టర్ల వ్యవహారంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. తనను తొలగించాలంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. వాటిపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో అటువంటి పోస్టర్లు అంటించేందుకు ప్రతిఒక్కరికి హక్కు ఉందన్నారు. అంతకుముందు ప్రధాని పేరుతో పోస్టర్లు అంటించిన ఆరుగురు అమాయకులను ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అది పీఎం అభద్రతాభావానికి నిదర్శనమన్నారు. తనకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్న వారిని మాత్రం అరెస్టు చేయవద్దని అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని