చమురు ఆదాయం.. ఆరేళ్లలో 300% జంప్‌

పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యుడు......

Published : 22 Mar 2021 18:39 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది (2014-15) పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం ద్వారా ₹29,279 కోట్లు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం ద్వారా ₹42,881 కోట్లు సమకూరిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి 10 నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌పై ₹2.94 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపారు.

2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం ₹9.48గా ఉండగా.. ప్రస్తుతం ₹32.90కి చేరిందని ఠాకూర్‌ తెలిపారు. డీజిల్‌పై ₹3.56గా ఉండగా అది ₹31.80 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌, సహజవాయువుపై వస్తున్న ఆదాయం వాటా 2014-15లో 5.4 శాతం ఉండగా.. ప్రస్తుతం 12.2 శాతానికి చేరిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ లెక్కన పెట్రోల్‌ ధరలో 60 శాతం, డీజిల్‌ ధరలో 53 శాతం పన్నుల వాటానే ఉంటోంది. పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని