Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ

ఒడిశా రైలు దుర్ఘటనలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. మృతదేహాల లెక్కింపులో పొరపాటు దొర్లడం వల్లే 288 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారని చెప్పింది.

Published : 04 Jun 2023 16:30 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన హోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒడిశా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.  ఇంతకుముందు 288 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పిన అధికారులు.. మృతదేహాల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్లు చెప్పారు. ‘‘ కొన్ని మృతదేహలను రెండు సార్లు లెక్కించారు. సంఘటన స్థలంలో లెక్కించి, ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరోసారి లెక్కపెట్టారు.  దీంతో మృతుల సంఖ్యలో తేడా వచ్చింది.చివరిసారి లెక్కించినప్పుడు స్పష్టత వచ్చింది’’ అని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ జెనా వెల్లడించారు.

మొత్తం 275 మంది మృతుల్లో ఇప్పటి వరకు 78 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 10 మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. మిగతా 187 వాటిల్లో 170 మృతదేహాలను భువనేశ్వర్‌కు , 17 మృతదేహాలను బాలేశ్వర్‌ జిల్లా కేంద్రానికి తరలించినట్లు చెప్పారు.  మొత్తం 85 అంబులెన్స్‌ల ద్వారా మృతులను భువనేశ్వర్‌లోని వివిధ మార్చురీలకు తరలించినట్లు చెప్పారు. మృతులు, క్షతగాత్రుల ఫొటోలను  https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org. వెబ్‌సైట్లలో పొందుపరిచామని, ఎవరైనా గుర్తిస్తే.. 18003450061 లేదా 1929 నెంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని