Mukesh Ambani: ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌.. ఈ సారి ₹200 కోట్లు డిమాండ్‌!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈ సారి ఆగంతకులు రూ. 200 కోట్లు డిమాండ్‌ చేస్తూ మెయిల్‌ పంపించారు. 

Updated : 29 Oct 2023 00:48 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి అక్టోబర్‌ 27న రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మా వద్ద మంచి షూటర్లున్నారంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. వారి బెదిరింపులకు ముకేశ్ అంబానీ వైపు నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా మరోసారి బెదిరింపు మెయిల్‌ను పంపించారు. మొదట పంపించిన మెయిల్‌కి స్పందించని కారణంగా రూ. 200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని బెదిరించారు. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు బెదిరింపు మెయిల్స్‌ ఒకే అకౌంట్‌ నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు వాజేను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని