‘పుల్వామా అమరుల త్యాగాన్ని మర్చిపోం’

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి

Updated : 14 Feb 2020 13:19 IST

ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్ షా నివాళి

దిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరులకు నివాళులర్పించారు. వారి త్యాగాన్ని భారత్‌ ఎన్నటికీ మర్చిపోదన్నారు. 

‘గతేడాది పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ధీర జవాన్లకు నివాళి. దేశ సేవ, రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన గొప్ప వ్యక్తులు వారు. ఆ అమరుల త్యాగాలను యావత్ భారతం ఎన్నటికీ మర్చిపోదు’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘2019లో ఇదే రోజున జరిగిన పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు నివాళులర్పిస్తున్నాం. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమైంది. దేశ రక్షణ కోసం ముష్కరులపై పోరు కొనసాగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’  అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. మాతృభూమి సార్వభౌమత, సమగ్రత కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబాల పట్ల భారత్‌ ఎప్పుడూ గర్వపడుతోందని కేంద్రమంత్రి అమిత్ షా ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు.

స్మారకస్తూపంతో నివాళి..

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని ఆవిష్కరించారు. ఆ స్తూపంపై 40 మంది జవాన్ల పేర్లు, ఫొటోలను ముద్రించారు. అమరువీరులకు ఇదే అసలైన నివాళి అని సీఆర్పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జుల్ఫికర్‌ హసన్‌ అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని