
క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ దోషి
దిల్లీ: నిర్భయ హత్యాచార ఘటనలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా (25) సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పిటిషన్లో పేర్కొన్నాడు. దీంతో పాటు ట్రయల్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్లపై స్టే విధించాలని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
నలుగురు నిర్భయ దోషుల్లో ఇప్పటి వరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోని దోషి పవన్ గుప్తా ఒక్కడే. దీని తర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ కేసులో దోషులైన ముకేశ్ కుమార్ సింగ్ (32), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31) ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడం.. తిరస్కరణకు గురవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ముకేశ్, వినయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంపై అక్షయ్ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు.
నిర్భయ దోషుల్లో ఒకరి తర్వాత ఒకరు క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పేరిట కాలయాపన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారి ఉరితీత పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులనూ ఉరితీసేందుకు ఈ నెల 17న దిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. పవన్ గుప్తా పిటిషన్ నేపథ్యంలో మరోసారి ఉరితీత అమలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.