పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం!

సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య పూరీ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు ప్రారంభమయింది.

Published : 23 Jun 2020 14:24 IST

బంగారు చీపురుతో శుభ్రం చేసిన పూరీ మహారాజు

పూరి: సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య పూరీ పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిరాడంబరంగా ప్రారంభమయింది. మూడు దారు రథాల్లో ఆసీనులైన సుభద్రా, బలభద్ర సమేత జగన్నాథ స్వామిని భక్తులు స్వయంగా లాగుతూ ‘బడొదండొ’ మార్గంలో గుండిచా దేవి మందిరానికి తీసుకువెళ్లే యాత్రనే రథయాత్ర అంటారని తెలిసిందే. కాగా నేడు ప్రత్యేక పూజల తర్వాత సంప్రదాయానుసారం మధ్యాహ్నం 12 గంటలకు పూరీ మహారాజు దివ్యసింగ్‌దేబ్‌ గజపతి.. బంగారు చీపురుతో స్వామివారి రథాన్ని శుభ్రం చేసే కార్యక్రమం ‘ఛెర్రా పహన్రా’ పూర్తిచేశారు. దీనితో జగన్నాధుడు తన నందిఘోష్‌ రథంలో, బలభద్రుడు తాళ ధ్వజంలోను, సుభద్రా దేవి దర్పదళన్‌ రథంలో తరలివచ్చే రథయాత్రకు మార్గం సుగమమయింది.

ఒక్కో రథాన్ని లాగేందుకు భద్రతా సిబ్బందితో సహా కేవలం 500 మందినే సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో... లక్షలాది భక్తులతో కిక్కిరిసి ఉండాల్సిన పూరీ వీధులు ఈసారి బోసిపోవడం గమనార్హం. చరిత్రలోనే తొలిసారిగా నేటి యాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. రథయాత్ర కొనసాగుతుండగానే క్రిమినాశక శానిటైజేషన్‌ ద్రవాన్ని పరిసరాల్లో పిచికారీ చేశారు. అంతేకాకుండా, కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను నియంత్రించేందుకు పట్టణంలోని అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని