
కరోనా తగ్గలేదో.. మంత్రివర్గం రద్దే!
హెచ్చరించిన కజఖ్స్థాన్ అధ్యక్షుడు టొకయేవ్
ముంబయి: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కజఖ్స్థాన్ అధ్యక్షుడు కస్యైమ్ జొమార్ట్ టొకయేవ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్-19 నుంచి విముక్తి పొందేందుకు రెండోసారి అమలు చేయబోతున్న రెండువారాల లాక్డౌన్ విఫలమైతే మంత్రివర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హెచ్చరించారు.
‘రెండో లాక్డౌన్ ముగిశాక మెరుగుదల లేకపోతే ప్రభుత్వ సామర్థ్యం, మంత్రివర్గ కూర్పుపై సందేహాలు తలెత్తుతాయి’ అని అధ్యక్షుడు టొకయేవ్ అన్నారు. ప్రస్తుతం కజఖ్స్థాన్లో 55,000 కేసులు ఉన్నాయి. 264 మంది మృతిచెందారు. గురువారం రోజు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జులై 5 నుంచి అక్కడ రెండో విడత లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
మొదటి లాక్డౌన్ వల్ల కజఖ్స్థాన్ ఆర్థిక వ్యవస్థ 1.8శాతం తగ్గింది. సేవల రంగం డీలాపడింది. చమురు, గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర నష్టాలు తలెత్తాయి. అందుకే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మంత్రివర్గాన్ని టొకయేవ్ ఆదేశించారు. కొవిడ్-19పై పోరాడేందుకు 150 బిలియన్ టెంజ్లు (363 మిలియన్ డాలర్లు) అదనంగా కేటాయిస్తున్నానని వెల్లడించారు. ద్రవ్యోల్బణం లక్షిత రేటును 8.0-8.5% నుంచి 9.0-11.0 శాతానికి సవరించాలని కేంద్ర బ్యాంకును కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.