కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు

‘ఆ స్వామీజీ నా కలల్లోకి వచ్చి పదే పదే అత్యాచారం చేస్తున్నాడు..

Updated : 26 Jun 2021 07:41 IST

స్వామీజీపై మహిళ ఫిర్యాదు

ఔరంగాబాద్‌ (బిహార్‌): ‘ఆ స్వామీజీ నా కలల్లోకి వచ్చి పదే పదే అత్యాచారం చేస్తున్నాడు.. చనిపోయిన నా కుమారుడు నన్ను రక్షించాడు’ అంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో ఔరంగాబాద్‌ జిల్లా పోలీసులకు నోట మాట రాలేదు. లిఖిత పూర్వకంగా మహిళ చేసిన ఫిర్యాదు కావడంతో ఇక తప్పదని సమన్లు పంపి స్వామీజీని రప్పించారు. విచారణలో సరైన ఆధారాలు కనిపించకపోవడంతో విడిచి పెట్టేశారు. ఇంతకూ జరిగిందేమిటంటే.. ఔరంగాబాద్‌ జిల్లాకు చెందిన ఆ మహిళ కుమారుడికి గత జనవరిలో గుర్తు తెలియని జబ్బు చేయడంతో నయం చేయాలని స్వామీజీని ఆశ్రయించింది. స్వామీజీ ఆమెకు మంత్రోపదేశం చేసి, కొన్ని ఆగమ ఆచారాలు పాటించాలని సూచించారు. ఆ తర్వాత పదిహేను రోజులకు ఆమె కుమారుడు మరణించాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌ తిన్న ఆ మహిళ స్థానిక ఆలయానికి వెళ్లి అక్కడున్న స్వామీజీని నిలదీసింది. తన కుమారుడి అకాల మరణానికి కారణం చెప్పాలని పట్టుబట్టింది. అనంతరం ఆమె పోలీసులను కలిసి పైవిధంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఔరంగాబాద్‌ డీఎస్పీ లలిత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ.. ‘ఆమె మానసిక పరిస్థితి బాగా లేదు. మానసిక చికిత్సాలయంలో చేర్చాలి. ఈ విషయమై ఆమె బంధువులతో పోలీసు అధికారులు మాట్లాడారు’ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని