China: భారత్‌పైకి భూటాన్‌ అస్త్రం..  మరో కుట్రకు తెరలేపిన చైనా

భారత్, చైనా సీనియర్‌ సైన్యాధికారుల మధ్య 13వ విడత సరిహద్దు చర్చలు విఫలమైన అనంతరం.. 

Updated : 17 Oct 2021 10:31 IST

ఆ దేశంతో మూడంచెల ఒప్పందం

దిల్లీ: భారత్, చైనా సీనియర్‌ సైన్యాధికారుల మధ్య 13వ విడత సరిహద్దు చర్చలు విఫలమైన అనంతరం.. మన దేశాన్ని చక్రబంధంలో ఇరికించడానికి బీజింగ్‌ చేస్తున్న కుట్రలు స్పష్టంగా వెలుగులోకి వస్తున్నాయి. మన పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి డ్రాగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ భూటాన్‌తో శుక్రవారం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం (ఎంఓయు). రెండు దేశాల మధ్య అపరిష్కృత వివాదాల పరిష్కారానికి చైనా మూడు అంచెల ఒప్పందాన్ని ప్రతిపాదించగా దీనికి భూటాన్‌ అంగీకారం తెలిపింది. చైనా, భూటాన్‌ మధ్య 37 ఏళ్ల నుంచి నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. భూటాన్‌ కనుక చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం (బీఆర్‌ఐ)లో చేరితే అది భారత్‌కు ఆందోళనకరమే. చైనా కమ్యూనిస్టు పార్టీ వాణిని ప్రతిబింబించే గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక అలాంటి ప్రమాదాన్ని సూచించింది. చైనా-భూటాన్‌ మూడు అంచెల ఒప్పందం బీఆర్‌ఐ పథకానికీ, చైనా సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికీ ఎంతో తోడ్పడుతుందని గ్లోబల్‌ టైమ్స్‌ ఉద్ఘాటించడం గమనార్హం. భూటాన్‌తో కుదిరే ఒప్పందం వల్ల చైనాకు మన సరిహద్దులోని కీలక శిలిగుడి కారిడార్‌పై డేగ కన్ను వేయడానికి అవకాశం చిక్కుతుంది. చికెన్స్‌నెక్‌గా వ్యవహరించే ఈ కారిడార్‌ భారత్‌ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలిపే అత్యంత కీలక ప్రాంతం. భారత్‌కు తెలియకుండా భూటాన్‌ చైనాతో సాగిస్తున్న రహస్య మంతనాల ఫలితమే మూడంచెల ఒప్పందం.

పాక్‌కు చైనా క్షిపణులు

భూటాన్‌తో ఒప్పందం కుదరడానికి ఒక రోజు ముందు బీజింగ్‌ నుంచి పొందిన క్షిపణులతో పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది. శత్రు దేశ యుద్ధ విమానాలు తన గగనతలంలోకి ప్రవేశిస్తే వాటిని కూల్చివేయడానికి ఈ క్షిపణి వ్యవస్థ తోడ్పడుతుంది. రష్యన్‌ ఎస్‌-300 క్షిపణులను పోలిన హెచ్‌క్యు 9పి హైమ్యాడ్స్‌ క్షిపణులను పాకిస్థాన్‌కు చైనా సరఫరా చేసింది. షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోనూ హెచ్‌క్యు 9 క్షిపణి వ్యవస్థను చైనా మోహరించింది. పాక్, చైనాల మధ్యనున్న సన్నిహిత రక్షణ బంధం దక్షిణాసియాలో సుస్థిరతను సంరక్షిస్తుందని పాకిస్థాన్‌ సైన్యాదిపతి జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా వ్యాఖ్యానించారు. హెచ్‌క్యు 9 గగన తల రక్షణ వ్యవస్థ ప్రారంభోత్సవంలో సీనియర్‌ చైనా అధికారులూ పాల్గొన్నారు. 100 కిలోమీటర్లకు అవతల ఉన్న శత్రు విమానాలను, క్షిపణులను ముందే పసిగట్టి ఎదురుదాడి జరిపే సత్తా హెచ్‌క్యు 9 వ్యవస్థకు ఉందని పాక్‌ సైన్యం తెలిపింది. ఈ క్షిపణులను భారత్‌ కు వ్యతిరేకంగా మోహరించడానికే చైనా సరఫరా చేసిందనడంలో సందేహం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని