జగమంత కుటుంబం జునాబాయిది

జునాబాయి.. తడోబా-అంధేరి టైగర్‌ రిజర్వును ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆడ పులి. వయసు తొమ్మిదేళ్లే. అయిదు విడతల్లో ఏకంగా 17 కూనలకు జన్మనిచ్చింది.

Published : 02 Feb 2023 07:28 IST

తడోబాను ఏలుతున్న ఆడ పులి
అయిదు విడతల్లో 17 పిల్లలకు జన్మ

ఈనాడు, హైదరాబాద్‌: జునాబాయి.. తడోబా-అంధేరి టైగర్‌ రిజర్వును ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆడ పులి. వయసు తొమ్మిదేళ్లే. అయిదు విడతల్లో ఏకంగా 17 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా రెండు కూనలతో సందడి చేస్తున్న సుందర దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తల్లి ప్రేమను పంచడంతో పాటు ఆత్మరక్షణ చేసుకోవడం, వేటాడటం లాంటి అంశాల్ని కూనలకు నేర్పిస్తోంది. ఈ అరుదైన దృశ్యాలను మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్‌ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ రాజేంద్రకుమార్‌ జైన్‌ తన కెమెరాలో బంధించారు. సాధారణంగా రక్షణ దృష్ట్యా పెద్దపులులు అడవి మధ్య కోర్‌ ఏరియాలో ఉంటాయి.

జునాబాయి (టీ 45) మాత్రం కోలార్‌-మద్నాపూర్‌ బఫర్‌ ఏరియాలోనే స్థిరనివాసం ఏర్పర్చుకుంది. బఫర్‌లో సాధారణంగా మనుషులు, పశువుల సంచారంతో ఇబ్బందులు, వేటగాళ్ల ముప్పు ఉంటాయి. కానీ ఈ పులి మాత్రం అక్కడే స్థిరపడింది. దాని పిల్లలు మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆవాసం ఏర్పర్చుకుంటున్నాయి. జునాబాయి తొలి విడత 2017లో మూడు, 2018లో నాలుగు, 2020లో మూడు, 2021లో నాలుగు, 2022లో మూడు కూనలకు జన్మనిచ్చింది. తన కూనల్ని చంపేందుకు మగ పులులు పలుమార్లు ప్రయత్నించగా వాటి బారినుంచి కాపాడుకుంది. తన సంతతిని భారీగా పెంచుకుంటోంది. తడోబా-అంధేరి టైగర్‌ రిజర్వు రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలో ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తిరిగే పలు పులులు తడోబా నుంచి వచ్చినవే. అక్కడ పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆవాసం సరిపోక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని