ఉత్తరాఖండ్‌లో అమృత్‌పాల్‌?

పరారీలో ఉన్న ‘ఖలిస్థాన్‌’ మద్దతుదారు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. అతడు దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నేపాల్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు.

Published : 25 Mar 2023 04:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరారీలో ఉన్న ‘ఖలిస్థాన్‌’ మద్దతుదారు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. అతడు దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నేపాల్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మార్చి 20న హరియాణాలో ఉన్న అమృత్‌పాల్‌.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేపాల్‌ మీదుగా కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల వద్ద అతడి పోస్టర్లను అంటించారు. అమృత్‌పాల్‌ కోసం వారం రోజులుగా పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. హరియాణాలోని కురుక్షేత్రలో ఓ వీధి గుండా అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో ముఖం కనిపించకుండా ఉండేందుకు అమృత్‌పాల్‌ గొడుగు అడ్డు పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

* అమృత్‌పాల్‌ చరిత్ర మొత్తం భయానకంగా ఉంది. డ్రగ్‌ డీలర్లతో సంబంధాలు, డీ అడిక్షన్‌ కేంద్రాల పేరిట ప్రైవేటు సైన్యాలు, హంతకులతో సంబంధాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ‘శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ’ సిక్కులకు మినీ పార్లమెంటు వంటిది. ఈ సంస్థ తాను అనుకొన్నట్లు సిక్కు చరిత్రను అన్వయించాలని అమృత్‌పాల్‌ భావించాడు. మత ప్రచారం పేరిట హింసాత్మక భావజాలాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ (ఏకేఎఫ్‌) పేరిట ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేశాడు. మాదకద్రవ్యాల డీఅడిక్షన్‌ పేరుతో తన పూర్వీకుల గ్రామంలో ఓ కేంద్రం ఏర్పాటు చేశాడు. గత నెల అజ్‌నాలా ఠాణాపై జరిగిన దాడి ఫుటేజీని చూసి.. ఈ కేంద్రంలోని చాలామంది అందులో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. అమృత్‌పాల్‌ గన్‌మన్‌ తేజిందర్‌సింగ్‌ గిల్‌ ఫోను నుంచి ఖన్నా పట్టణ పోలీసులు కీలక వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో ఏకేఎఫ్‌ బృంద సభ్యులకు తుపాకుల వినియోగంపై శిక్షణ ఇస్తున్న క్లిప్‌లు ఉన్నాయి. పంజాబ్‌ను అశాంతిలోకి నెట్టడానికి అమృత్‌పాల్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌ ఓ నాటకమని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అమృత్‌సర్‌ డీఎస్పీ హరికిషన్‌సింగ్‌ వెల్లడించారు.

* అమృత్‌పాల్‌ వెనుక ఉన్న జశ్వంత్‌సింగ్‌ రోడే.. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుంటాడు. అమృత్‌పాల్‌ భారత్‌కు వచ్చాక పాక్‌ నుంచి డ్రోన్లతో డ్రగ్స్‌ సరఫరాలు పెరిగినట్లు తెలుస్తోంది. అమృత్‌పాల్‌ వెనుక ఉన్న మరో కీలక ఉగ్రవాది హర్వీందర్‌ సింగ్‌ రిండా. ఇతడు పంజాబ్‌ నుంచి మహారాష్ట్ర వరకూ మాదకద్రవ్యాల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అమృత్‌పాల్‌కు మెర్సిడెస్‌ కారు ఇచ్చిన రవీల్‌సింగ్‌పైనా డ్రగ్స్‌ ఆరోపణలు ఉన్నాయి. అమృత్‌సర్‌లో హక్కుల కార్యకర్త సుధీర్‌ సూరి గతేడాది నవంబర్‌లో హత్యకు గురయ్యాడు. సూరి హంతకుడి కారుపై ఏకేఎఫ్‌ స్టిక్కర్‌ ఉంది. ఈ హత్యకు నాలుగు రోజుల ముందు అతడు అమృత్‌పాల్‌ను కలిసినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

పాపల్‌ప్రీత్‌ సింగ్‌కు ఐటీ నోటీసు

అమృత్‌పాల్‌ సింగ్‌ గురువు పాపల్‌ప్రీత్‌ సింగ్‌ ఖాతాలో చేరిన రూ.4.48 లక్షల అనామతు డబ్బు లెక్కలు   చూపాలంటూ ఐటీ నోటీసులు పంపినట్లు అధికారులు  శుక్రవారం వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని