మణిపుర్, అస్సాం సీఎంల భేటీ
మణిపుర్లో హింసను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు శనివారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గువాహటి నుంచి ఇంఫాల్ వచ్చారు.
హింసను అరికట్టే చర్యలపై చర్చ
ఇంఫాల్: మణిపుర్లో హింసను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు శనివారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గువాహటి నుంచి ఇంఫాల్ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో సమావేశమయ్యారు. కేంద్రం పంపిన సందేశాన్ని బీరేన్ సింగ్కు చేరవేసేందుకే ఆయన వచ్చారని సమాచారం. భేటీ తర్వాత అస్సాం సీఎం కొన్ని వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులతో చర్చలు జరిపానని, పరిస్థితిని అమిత్ షాకు వివరిస్తానని తెలిపారు. మరోవైపు మణిపుర్లో శాంతి స్థాపనకు కావాల్సిన సహకారాన్ని అందజేస్తానని హిమంత హామీ ఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న భాజపా నేత ఒకరు తెలిపారు. కేంద్రానికి పరిస్థితులను వివరించాక మళ్లీ వస్తానని పేర్కొన్నట్లు వెల్లడించారు.
గాయాలపై ఉప్పు రాసినట్లుంది: ఖర్గే
మణిపుర్పై ప్రధాని మౌనం వహించడం గాయాలపై ఉప్పు రాసినట్లుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర ప్రజలపై ఆయన తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు.
130 ఆయుధాల అప్పగింత
ఘర్షణల సందర్భంగా భద్రతా దళాల నుంచి ఎత్తుకెళ్లిన ఆయుధాలను క్రమంగా స్థానిక యువత అప్పగిస్తున్నారు. మైతెయీ నేత, మంత్రి అయిన భాజపా నేత సుసింద్రో మైతెయీ ఇంటి ముందు డ్రాప్ బాక్సుతోపాటు పెద్ద పోస్టరు ఏర్పాటు చేయడంతో వారు ఆయుధాలను అక్కడ వేస్తున్నారు. శనివారం నాటికి 130 ఆయుధాలను యువత అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.