సత్యేంద్రజైన్‌కు రూ.10కోట్లు ఇచ్చా.. సుకేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు

ఆమ్ ఆద్మీ పార్టీ తనకు దక్షిణాదిలో కీలక పదవి అప్పగిస్తానని హామీ ఇచ్చిందని, దాంతో ఆ పార్టీకి రూ.50కోట్ల మేర సమకూర్చానని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ఆరోపించాడు.

Updated : 01 Nov 2022 15:28 IST

దిల్లీ: ఆర్థిక నేరగాడు, రూ.200కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌.. దిల్లీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి తాను కోట్లాది రూపాయాలు సమకూర్చానని తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్‌ తన నుంచి బలవంతంగా రూ.10కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి జైన్‌ తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు లేఖ రాశాడు.

‘‘2015 నుంచి సత్యేంద్రజైన్‌తో నాకు పరిచయం ఉంది. దక్షిణాదిలో నాకు కీలక పదవి అప్పగిస్తానని, పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్‌ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాకు హామీ ఇచ్చింది. అందువల్ల ఆ పార్టీకి నేను రూ.50కోట్లకు పైగా డబ్బు సమకూర్చాను. 2017లో నేను అరెస్టయిన తర్వాత తిహాడ్‌ జైల్లో ఉంచారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ నన్ను కలిశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డబ్బు గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా? అని అడిగారు.  ఆ తర్వాత 2019లో మరోసారి అరెస్టయినప్పుడు సత్యేంద్రజైన్‌ తన సెక్రటరీ, మరో సన్నిహితుడితో జైలుకు వచ్చి నన్ను కలిశారు. జైల్లో రక్షణ, సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2కోట్లు కట్టాలని జైన్‌ డిమాండ్ చేశారు. అంతేగాక డీజీ(జైళ్లు) సందీప్‌ గోయెల్‌కు ప్రతినెలా రూ.1.5కోట్లు ఇవ్వాలని చెప్పారు. నాపై ఒత్తిడి పెంచి కొన్ని నెలలు బలవంతంగా కట్టించుకున్నారు. అలా సత్యేంద్ర జైన్‌కు రూ.10కోట్లు, సందీప్‌ గోయెల్‌కు రూ.12.5కోట్లు చెల్లించాను. ఇటీవల ఈడీ దర్యాప్తులో భాగంగా జైళ్లలో జరుగుతున్న దోపిడీ రాకెట్‌ గురించి నేను అధికారులకు చెప్పాను. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశాను’’ అని సుకేశ్‌ లేఖలో వివరించాడు.

ఇప్పుడు సత్యేంద్ర జైన్‌ కూడా అవినీతి కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లోనే ఉన్నారు. దీంతో పిటిషన్‌ గురించి తెలియగానే జైన్‌.. తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. జైన్‌కు డబ్బులు ఇచ్చినట్లు తన వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ ఎల్‌జీకి లేఖ రాశాడు. అయితే సుకేశ్‌ ఆరోపణలను ఈడీ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపడతామని, త్వరలోనే ఈ విషయాల గురించి సుకేశ్‌ను ప్రశ్నిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. జైలు అధికారులకు సుకేశ్ లంచం ఇచ్చినట్లు గతంలోనూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

‘మోర్బీ’ నుంచి దృష్టిమళ్లించేందుకే..: కేజ్రీవాల్‌

సుకేశ్ ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. భాజపా కావాలనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. ‘‘గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటివరకు అన్ని టీవీ ఛానళ్లు ఇవే కథనాలను ప్రసారం చేశాయి. ఒక్కసారిగా ఆ వార్తలు కన్పించకుండా పోయి సుకేశ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మోర్బీ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కల్పిత కథనాలు సృష్టిస్తున్నారని అన్పించడం లేదా?’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ అరెస్టయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని