India Corona: కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా నాలుగోరోజు మూడు లక్షల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి.

Published : 28 Jan 2022 10:01 IST

ఊరటనిస్తోన్న రికవరీలు..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా నాలుగోరోజు మూడు లక్షల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి..2.51 లక్షలకు చేరాయి. ముందురోజుతో పోల్చితే పాజిటివిటీ రేటు 19.5 శాతం నుంచి 15.88 శాతానికి తగ్గింది. నిన్న 15 లక్ష మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కేరళలో 94 శాతం నమూనాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌...మహారాష్ట్ర, దిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్, రాజస్థాన్‌లో పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదవుతోంది. నిన్న ఒక్క కేరళలో 51 వేల మందికి కరోనా సోకింది. 94 శాతం కొవిడ్ పాజిటివ్‌ నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వెల్లడించారు. మిగిలిన ఆరు శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉన్నట్లు చెప్పారు. కేరళలో మూడో వేవ్‌కు ఒమిక్రాన్ వేరియంట్ కారణమని ఈ గణాంకాలతో స్పష్టమైందని తెలిపారు.

మరణాలు పెరిగాయి..అయితే ఒకవైపు దేశంలో కొత్త కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 627 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 153 కేరళ నుంచి వచ్చినవే. ఈ రెండేళ్ల కాలంలో 4,92,327 మంది మహమ్మారికి బలయ్యారు.

భారీగా రికవరీలు..గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. నిన్న 3,47,443 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.60 శాతానికి మెరుగైంది. ఇప్పటివరకూ 4.06 కోట్ల మందికి కరోనా సోకగా.. 3.8 కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 21 లక్షలకు చేరాయి. ఆ కేసుల రేటు 5.18 శాతానికి తగ్గింది.

164 కోట్ల డోసుల పంపిణీ..ఇక నిన్న 57.3 లక్షల మంది టీకా తీసుకున్నారు. సంవత్సర కాలంలో కేంద్రం 164 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. అర్హులైన జనాభాలో 95 శాతం మందికి మొదటి డోసు అందగా.. 74 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని