JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

jee advanced పరీక్ష షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జూన్‌ 4న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి వెల్లడించింది.

Updated : 22 Dec 2022 19:34 IST

గువాహటి: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షను జూన్‌ 4న నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి(IIT Guwahati) వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయిన అభ్యర్థులు మే 5వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉండగా.. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌ -1 ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్‌- 2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.

ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఈ  పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఐఐటీ గువాహటి పేర్కొంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులైతే ఏప్రిల్‌ 24 నుంచి మే 4వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5వ తేదీ వరకు వెసులుబాటు కల్పించింది.  మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది.  2023 ఏడాదికి గాను ఐఐటీ గువాహటి ఈ పరీక్ష నిర్వహిస్తుండటంతో ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేసింది. 

మరోవైపు, జేఈఈ మెయిన్‌ పరీక్ష-2023 పరీక్ష తేదీలను ఇప్పటికే ఎన్‌టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది. దేశంలోని ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (BE/Btech/BArch,etc) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10లక్షల మందికి పైగా విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో టాప్‌ స్కోర్‌ సాధించిన 2.5లక్షల మంది విద్యార్థులకు ప్రఖ్యాత సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని