చాట్‌జీపీటీ నా జీవితాన్ని తలకిందులు చేసింది.. 90శాతం ఆదాయం కోల్పోయా!

చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత తన జీవితం కష్టాల్లోకి వెళ్లిపోయిందని కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల శరణ్య భట్టాచార్య అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Updated : 06 Aug 2023 05:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (Artificial intelligence) వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం తలకిందులైందని కోల్‌కతాకు (Kolkata) చెందిన శరణ్య భట్టాచార్య అనే 22 ఏళ్ల విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వచ్చే నెలవారీ ఆదాయానికి దాదాపు 90శాతం మేర కోతపడుతోందని సామాజిక మాధ్యమాల వేదికగా చెప్పుకొచ్చింది. కృత్రిమ మేధతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ. డిగ్రీ పూర్తి చదువుతున్న శరణ్య స్థానికంగా క్రియేటివ్‌ సొల్యూషన్స్‌ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్‌ చేస్తోంది. తద్వారా వచ్చిన డబ్బులతో చదువు కొనసాగిస్తోంది. ఎస్‌ఈవోకి అనుగుణంగా కొన్ని కథనాలు రాసి నెలకు దాదాపు రూ.20,000 వరకు సంపాదించేది.

చాట్‌జీపీటీ (ChatGPT) వినియోగంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా కష్టాల్లోకి వెళ్లిపోయింది. వర్క్‌లోడ్‌ బాగా తగ్గిపోయింది. నెలకు 1 లేదా 2 కథనాలకు మాత్రమే ఆ ఏజెన్సీ అవకాశం కల్పిస్తోంది. ఎందుకు ఎక్కువ కథనాలు రాసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని అడిగినా.. ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేదు. తాను చేసే పనిని కృత్రిమ మేధతో చేయించుకుంటున్నారని అందుకే తనకు తక్కువ పనిని అప్పగిస్తున్నారని శరణ్య చెప్పుకొచ్చింది. తనకు వచ్చిన ఆదాయంతో ఇక్కడ చదువు కొనసాగించడమే కాకుండా ఇంటిదగ్గరున్న 45 ఏళ్ల తన తల్లికి కూడా చేదోడుగా నిలిచేదాన్నని, తన జీతంలో కోత ప్రభావం కుటుంబంపైనా పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.

‘చంద్రయాన్‌-3’ కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి

శరణ్య తల్లి చీరలు విక్రయిస్తారు. ఖర్చుల కోసం ఆమెను డబ్బులు అడగడం బాధగా ఉందని చెబుతోంది శరణ్య. ఇంటి ఖర్చుల కోసం లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఎవరిపైనా ఆధారపడకుండా చదువు కొనసాగించినట్టు తెలిపింది, కృత్రిమ మేధ తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని చెప్పుకొచ్చింది. గత రెండు నెలలుగా పూర్తిగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. యంత్రాలు చేసే పనికి, మనుషులు చేసే పనికి చాలా తేడా ఉంటుందని చెబుతూ..  ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించింది. లేదంటే చాలా మంది రోడ్డున పడాల్సి వస్తుందని హెచ్చరించింది.‘‘ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కాపీ రైటర్‌లు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. భవిష్యత్తులో మానవులు తమ రాత నైపుణ్యాలను కృత్రిమమేధతో అనుసంధానించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మార్గం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అంటూ భట్టాచార్య రాసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని