Agni V: ఏకకాలంలో బహుళ లక్ష్యాల ఛేదన.. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ విజయవంతం

‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో అగ్ని-5 క్షిపణిని ‘డీఆర్‌డీవో’ మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. సంస్థ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

Updated : 11 Mar 2024 19:02 IST

దిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హర్షం వ్యక్తంచేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు.

అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగుదేశం చైనా వద్ద డాంగ్‌ఫెంగ్‌-41 వంటి క్షిపణులున్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కి.మీ. ఉంటుంది. ఈనేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకొని అగ్ని-5ను భారత్‌ తయారుచేసింది. ఆసియా యావత్తూ దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని ఇవి చేరుకోగలవు. అవన్నీ మన రక్షణ బలగాలకు అందుబాటులోకి వచ్చాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని