Corona: అనాధలైన చిన్నారులు 30వేల మంది

దేశంలో గతేడాది నుంచి విలయం సృష్టిస్తున్న కరోనా కారణంగా 30 వేలకు పైగా చిన్నారులకు తల్లిదండ్రులకు దూరమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Published : 17 Jun 2021 01:36 IST

సుప్రీంకు నివేదిక అందించిన ఎన్సీపీసీఆర్‌

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: దేశంలో గతేడాది నుంచి విలయం సృష్టిస్తున్న కరోనా కారణంగా 30 వేలకు పైగా చిన్నారులు తల్లిదండ్రులకు దూరమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు వివరాలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) సుప్రీంకోర్టుకు సమర్పించింది. కరోనాతో అనాధలైన చిన్నారులకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలైన విషయం తెలిసిందే. దీంతో వారి వివరాలను ఎన్సీపీసీఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ వివరాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 3,621 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలు కాగా, 26,176 మంది తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయారు. వీరిలో 15,620 మంది బాలురు ఉండగా, 14,447 మంది బాలికలు ఉన్నారు. ఎక్కువగా 8-13 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు  11,815 మంది తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరినీ కోల్పోయారని కమిషన్‌ నివేదికలో వెల్లడించింది. 16-18 ఏళ్ల వయసున్న వారు 5,339 మంది, 4-7 వయసున్న వారు 5,107 మంది, 14-15 ఏళ్ల వయసున్న వారు 4,908 మంది, మూడేళ్ల లోపు వారు 2,900 మంది ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది.

ఏఏ రాష్ట్రాల్లో ఎంతమందంటే..

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అత్యధికంగా మహారాష్ట్రలో (7,084) ఉన్నట్లు ఎన్‌సీపీసీఆర్‌ తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ (3,172), రాజస్థాన్‌ (2,482), హరియాణా (2,483), మధ్యప్రదేశ్‌ (2,243), ఆంధ్రప్రదేశ్‌ (2,089), కేరళ (2,002), బిహార్‌ (1,634), ఒడిశా (1,073) రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా సమయంలో చిన్నారుల సంరక్షణ కోసం బాల స్వరాజ్‌ అనే పోర్టల్‌ను బాలల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 577 మంది చిన్నారులు అనాధలుగా మారారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మే 26న వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 3,79,573 మందిని కరోనా మహమ్మారి పొట్టన బెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని