సీఎం కుర్చీలో శిందే కుమారుడు.. సూపర్‌ సీఎం అంటూ ప్రతిపక్షం విమర్శలు!

మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వివాదానికి కారణమైంది.

Published : 23 Sep 2022 16:26 IST

ముంబయి: మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన ఫొటో బయటకు రావడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సూపర్‌ సీఎం అంటూ ఎద్దేవా చేశాయి. మహారాష్ట్రలోని ఎన్సీపీకి చెందిన రవికాంత్‌ వార్పే ఈ ఫొటోను షేర్‌ చేశారు. ఆ చిత్రంలో ముఖ్యమంత్రి పీఠంపై శ్రీకాంత్‌ శిందే కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ అధికారులు ఉండగా.. ఆయనేవో దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు అందులో ఉంది. 

ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు ఆయన కుమారుడు ఇలా ముఖ్యమంత్రి బాధ్యతలు చూస్తున్నారంటూ రవికాంత్‌ వార్పే ఫొటోతో పాటు ట్వీట్‌లో పేర్కొన్నారు. సూపర్‌ సీఎం అయినందుకు శ్రీకాంత్‌ శిందేకు అభినందనలు అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. ‘‘ఇది ముఖ్యమంత్రి అధికారిక నివాసం. ఆయన వెనుక మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని రాసి ఉంది. అధికారిక సమావేశాలు లేదా అనధికారిక సమావేశాలకు హాజరు కావాలంటే ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే కూర్చోవాలి. కానీ ఇక్కడ ఏకంగా సీట్లోనే కూర్చున్నారు’’ అని పేర్కొన్నారు. ఇది మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ పీఠానికి సంబంధించిన విషయంగా పేర్కొన్నారు. ఏదేమైనా తమ ప్రభుత్వాన్ని కూలదోసి అధికార పీఠమెక్కిన ఏక్‌నాథ్‌ శిందే వర్గాన్ని విమర్శించేందుకు ఉద్ధవ్‌ వర్గానికి శ్రీకాంత్‌ శిందే రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని