Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ

అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం).. దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్‌లోని

Updated : 17 Sep 2022 14:01 IST

భోపాల్‌: అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం).. దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మోదీ ప్రత్యేక క్వారెంటైన్‌ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అనంతరం మోదీయే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ ఉన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజునే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం విశేషం.

నమీబియాలోని విండ్‌హాక్‌ నుంచి ఈ చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యింది. అక్కడ వీటికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునే నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు. అనంతరం ప్రధాని మోదీ పార్క్‌కు చేరుకుని చీతాలను ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు.

ఇదో చారిత్రక క్షణం..: మోదీ

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘కొన్ని దశాబ్దాల తర్వాత చీతాలు మళ్లీ మన గడ్డపైకి వచ్చాయి. ఈ చారిత్రక క్షణాన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇందుకు సహకరించిన నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వారి సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. దురదృష్టవశాత్తూ 1952లో మనం వీటిని అంతరించిన జాతిగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చేందుకు ఎలాంటి అర్థవంతమైన ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జరుపుకొంటున్న వేళ చీతాలు మళ్లీ మన దేశానికి రావడం ఆనందంగా ఉంది. కునో నేషనల్‌ పార్క్‌లో వీటిని చూసేందుకు ప్రజలు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇవి మన దేశానికి అతిథులుగా వచ్చాయి. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. చీతాలు ఇక్కడ సెటిల్‌ అయ్యేలా భారత్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటిస్తూ చీతాలను సంరక్షిస్తాం’’ అని మోదీ తెలిపారు.

ఈ ప్రాజెక్టుతో దాదాపు 74ఏళ్ల తర్వాత భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు తీసుకొచ్చారు. 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలను నేడు పార్క్‌లో విడుదల చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని