అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరో పిడుగు

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది.

Published : 07 May 2024 04:35 IST

ఎన్‌ఐఏ విచారణకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు
హోంమంత్రిత్వ శాఖకు లేఖ

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి సుమారు రూ.134 కోట్ల మేర నిధులను స్వీకరించారని కేజ్రీవాల్‌పై ఫిర్యాదు అందిందని, దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) వి.కె.సక్సేనా లేఖ రాశారు. ఈ ఫిర్యాదును వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ జాతీయ కార్యదర్శి ఆషూ మోంగియా చేసినట్లు లేఖలో ఎల్జీ పేర్కొన్నారు.

1993లో దిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషి.. దేవేంద్ర సింగ్‌ భుల్లార్‌ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ పార్టీ భారీగా నిధులను తీసుకుందన్నది ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ. భుల్లార్‌కు 2021 ఆగస్టు 25న టాడా కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ శిక్షను జీవితఖైదుగా మార్చింది. 2023 డిసెంబరులో భుల్లార్‌ ముందస్తు విడుదలపై దిల్లీ ప్రభుత్వ శిక్షా సమీక్ష బోర్డు సమావేశమైంది. ముందస్తు విడుదలకు భుల్లార్‌ అనర్హుడని తేల్చింది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఫిర్యాదులో భాగంగా ఓ వీడియో కూడా ఎల్జీకి అందింది. ఇందులో న్యూయార్క్‌లోని రిచ్‌మండ్‌ హిల్స్‌ గురుద్వారాలో ఖలిస్థాన్‌ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ చేసిన ప్రసంగం కూడా ఉంది. 2014-22 మధ్య కాలంలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌.. ఖలిస్థాన్‌ సంస్థల నుంచి 16 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.134 కోట్లు) నిధులు అందుకుందని ఆ ప్రసంగంలో పన్నూ ఆరోపించారు. ఆప్‌ మాజీ నేత మునీశ్‌ కుమార్‌ రైజాదా ‘ఎక్స్‌’లో పెట్టిన చిత్రాలనూ లేఖలో వి.కె.సక్సేనా ప్రస్తావించారు. 2014లో రిచ్‌మండ్‌ గురుద్వారాలో ఖలిస్థాన్‌ నాయకులతో కేజ్రీవాల్‌ సమావేశమైన చిత్రాలను రైజాదా పోస్టు చేశారు. వీటిపైనా దర్యాప్తు చేయాలని ఎల్జీ కోరారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేఖపై ఆప్‌ మండిపడింది. భాజపా పన్నిన మరో కుట్రగా దీన్ని అభివర్ణించింది. ‘‘దిల్లీలో ఏడు సీట్లూ కోల్పోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిపోతామన్న భయం పట్టుకుంది. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు’’ అని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని