Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్‌ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

ఇటీవల కాంగ్రెస్‌(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు.

Updated : 18 Mar 2024 10:44 IST

ముంబయి: ఇటీవల భాజపా(BJP)లో చేరిన సీనియర్ నేత అశోక్‌ చవాన్‌(Ashok Chavan)ను ఉద్దేశించి కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబయి(Mumbai)లో జరిగిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన భాజపాపై విమర్శలు గుప్పించారు. 

‘‘మనం అధికారంతో పోరాడుతున్నాం. అందులో ఉన్న వ్యక్తులు ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని కన్నీటిపర్యంతమయ్యారు’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. 

వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్‌ సాల్వే

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు కొందరు ఇటీవల భాజపాలో చేరారు. వారిలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా శివసేన(శిందే వర్గం)లో చేరారు. 48 ఏళ్లుగా పార్టీలో ఉన్న బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మణిపుర్‌లోని తౌబాల్‌ జిల్లాలో జనవరి 14న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 100కిపైగా జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాల మీదుగా కొనసాగింది. 63 రోజుల అనంతరం ముంబయి చేరుకుంది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి ‘ఇండియా’ కూటమికి చెందిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సభపై భాజపా విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌తో నిలబడాలని ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని