Sanjay Raut: నన్ను, నా సోదరుడినీ చంపేస్తామని బెదిరింపులు.. సంజయ్‌ రౌత్‌

కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్‌కు బెదరింపులు రావడంపై ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఇందులో ప్రతిపక్షాలను బెదిరింపులకు గురిచేయాలనే ఎత్తుగడ ఉందని పేర్కొన్నారు.

Published : 09 Jun 2023 20:01 IST

ముంబయి: ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar)కు బెదిరింపు సందేశాలు రావడం మహారాష్ట్రలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌(Sanjay Raut) స్పందించారు.  తనకు, ఎమ్మెల్యే అయిన తన సోదరుడు సునీల్‌ రౌత్‌ను సైతం చంపేస్తామంటూ బెదిరింపులు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు ఆయన వెల్లడించారు.  బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌కు బెదిరింపు సందేశాలు రావడం చాలా తీవ్రమైన అంశమన్నారు. ప్రతిపక్షాలను భయాందోళనకు గురిచేసేందుకు ఇదో ఎత్తుగడలా ఉందని సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. ఇలాంటి తరహా ఘటనల్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ తరహా బెదిరింపులను ప్రభుత్వం కూడా కోరుకుంటోందంటూ ఆరోపించిన రౌత్‌.. ఈ అంశం పోలీసుల వద్ద ఉండటంతో వారే పరిశీలించాలన్నారు. తన సోదరుడు సునీల్‌ రౌత్‌కు బెదిరింపులు వచ్చాయన్న రౌత్‌.. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని.. గతంలోనూ అనేకం ఇలాంటివే వచ్చాయని చెప్పారు. మూఢవిశ్వాసాలపై ఉద్యమించిన కార్యకర్త నరేంద్ర దభోల్కర్‌ను 2013లో దారుణంగా కాల్చి చంపినట్టే శరద్‌ పవార్‌కు సైతం అదే గతి పడుతుందంటూ ఫేస్‌బుక్‌లో దుండగుల నుంచి బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్టు ఎన్సీపీ పేర్కొనడంపై రౌత్‌ స్పందించారు. ప్రతిపక్షంలో భయాన్ని కలిగించేందుకు ఇదో ఎత్తుగడగా పేర్కొన్నారు. దీని వెనుక 40మంది( సీఎం ఏక్‌నాథ్‌ శిందే సహా ఎమ్మెల్యేలు)  సూపర్‌ పవర్‌గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని