బెంగాల్‌లో మొదలైన ఏడో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం ఏడో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 34 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది.

Published : 26 Apr 2021 08:36 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం ఏడో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 34 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 34 స్థానాల పరిధిలో 86లక్షల ఓటర్లు ఉండగా.. 12,068 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో 796 కంపెనీల కేంద్ర బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు  చేశారు. ఈ దశలో మొత్తం 284 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా.. మరోవైపు పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్లో ఆదివారం ఒక్కరోజే 15వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 57 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. ఇక చివరి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 29న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. 

ఓటర్లూ.. కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి: మోదీ
బెంగాల్‌లో ఏడో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు. ‘బెంగాల్‌ అసెంబ్లీకి నేడు ఏడో దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటిస్తూ.. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా’ అని మోదీ పేర్కొన్నారు.  



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని