SBI Report: రాష్ట్రాల ‘ఉచితాలు’ ఆందోళనకరమే: ఎస్‌బీఐ నివేదిక

భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ‘ఆర్థికంగా నిలకడలేని’ ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం ఆందోళనకర విషయమేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక

Published : 19 Apr 2022 02:46 IST

దిల్లీ: భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ‘ఆర్థికంగా నిలకడలేని’ ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం ఆందోళనకర విషయమేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక ఒకటి వెల్లడించింది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఎస్‌బీఐ రీసర్చ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. 

కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ప్రకటిస్తోన్న ఉచితాలు వాటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయపడింది. తెలంగాణ సహా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ వంటి రాష్ట్రాలు తమ రెవెన్యూ ఆదాయంలో 5-19 శాతం రుణమాఫీ వంటి ఉచిత పథకాల కోసం ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. పన్నుల పరంగా చూసుకుంటే.. రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయంలో దాదాపు 53శాతం ఉచితాలకు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో అయితే రాష్ట్ర రెవెన్యూలో 35శాతం ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తున్నట్లు తెలిపింది.

ఇక, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18 రాష్ట్రాల సగటు ద్రవ్య లోటు 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4 శాతానికి చేరిందని వెల్లడించింది. ఇక, 6 రాష్ట్రాల్లో ఏకంగా ద్రవ్యలోటు 4శాతం దాటేసి ప్రమాదకర దిశగా ఉందని పేర్కొంది. 11 రాష్ట్రాల ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలకు సమానంగా లేదా తక్కువగా ఉండగా.. 7 రాష్ట్రాల్లో ద్రవ్యలోటు బడ్జెట్‌ లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. బిహార్‌, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ ద్రవ్యలోటు ఉన్నట్లు ప్రకటించాయి. 

ప్రజాకర్షక పథకాలు దీర్ఘకాలంలో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సీనియర్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా.. అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని.. ఇలాగే కొనసాగితే శ్రీలంకతరహా ఆర్థిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తడం తథ్యమని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని