Permanent commission: ‘మీరు చేయకుంటే మేము చేస్తాం’!.. కేంద్రానికి సుప్రీం వార్నింగ్‌

భారత తీరగస్తీ దళం (Indian Coast Guard)లో అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.

Published : 26 Feb 2024 18:46 IST

దిల్లీ: భారత తీరగస్తీ దళం (Indian Coast Guard)లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

అర్హులైన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిణులతో శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేయాలని కోరుతూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి వాదనలు వినిపించారు. ఆర్మీ, నేవీతో పోలిస్తే కోస్ట్‌ గార్డులో పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుందని సుప్రీం ధర్మాసనం దృష్టికి అటార్నీ జనరల్‌ తీసుకెళ్లారు. మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. అందుకే.. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పందనను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

ఇదిలాఉంటే, వారం క్రితం ఇదే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందేనని కేంద్రానికి స్పష్టంచేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సుప్రీం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని నిలదీసింది. నౌకాదళంలో శాశ్వత కమిషన్‌ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్‌ అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని