Bird flu: ఈ వైరస్ గురించి భయంవద్దు

బర్డ్ ఫ్లూతో 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందడం కలకలం రేపింది. ఇది దేశంలో చోటుచేసుకున్న మొదటి మరణం కావడంతో ఆందోళన నెలకొంది.

Published : 22 Jul 2021 01:26 IST

మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుందనే ఆధారాల్లేవన్న గులేరియా

దిల్లీ: బర్డ్ ఫ్లూతో 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందడం కలకలం రేపింది. ఇది దేశంలో చోటుచేసుకున్న మొదటి మరణం కావడంతో ఆందోళన నెలకొంది. అయితే దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా బుధవారం స్పష్టతనిచ్చారు. మనుషుల మధ్య హెచ్‌5ఎన్‌1 వైరస్ వ్యాప్తి చాలా అరుదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 

‘పక్షుల నుంచి మానవులకు ఈ వైరస్ వ్యాప్తి చెందడం చాలా అరుదు. అలాగే మనుషుల నుంచి మనుషులకు ఇది వ్యాప్తి చెందుతుందనే ఆధారాల్లేవు. అందుకే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అయితే పౌల్ట్రీకి దగ్గర్లో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రతను పాటించాలి’ అని గులేరియా వెల్లడించారు. ‘అలాగే సరిగా వండిన పౌల్ట్రీ వంటకాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. సరైన ఉష్ణోగ్రతల వద్ద వండిన పదార్థాల నుంచి వైరస్ వ్యాపించిన దాఖలాలు లేవు. ఆ వేడికి వైరస్ నశిస్తుంది. వైరస్ సోకిన పక్షులకు తగిన దూరం పాటించడం మంచిది’ అని ఎయిమ్స్‌కు చెందిన మరో అధికారి వెల్లడించారు. 

బర్డ్‌ఫ్లూను హెచ్‌5ఎన్‌1 వైరస్ లేదా ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది పక్షులు, కోళ్లకు వస్తుంది. బర్డ్‌ ఫ్లూ ఓ మనిషికి సోకడం, చనిపోవడం భారత్‌లో ఇదే తొలిసారి. హరియాణాకు చెందిన సుశీల్ అనే బాలుడు నిమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. అనంతరం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపగా.. అక్కడ బర్డ్‌ ఫ్లూ అని తేలింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో మరిన్ని కేసుల్ని గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హరియాణాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది. అలాగే మృతుడికి చికిత్స అందించిన వైద్యసిబ్బంది ఐసోలేషన్‌కు వెళ్లారు. ఇంకోపక్క, ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ ధాటికి వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని