కాంవడ్‌ యాత్రపై ఆలోచిస్తారా.. ఆదేశాలిమ్మంటారా? 

కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ‘కాంవడ్‌ యాత్ర’ నిర్వహించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది

Published : 16 Jul 2021 14:03 IST

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

దిల్లీ: కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ‘కాంవడ్‌ యాత్ర’ నిర్వహించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదంటే యాత్ర రద్దుపై తామే బలవంతంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

జులై 25 నుంచి కాంవడ్‌ యాత్రకు యూపీ ప్రభుత్వం భక్తులను అనుమతించనుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరిస్తుంటారు. కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలో కాంవడ్ యాత్ర జరుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదికను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే కరోనా మూడో ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ కాంవడ్‌ యాత్రకు అనుమతివ్వడాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. దీనిపై ఇటీవల విచారణ జరిపి యూపీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం నేడు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ విషయంపై విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం కాంవడ్‌ యాత్రను కొవిడ్‌ ఆంక్షలు, పరిమితుల నడుమ లాంఛనప్రాయంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘దేశ ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కు అన్నింటికంటే ప్రధానమైనది. ఇతర విశ్వాసాలు, మతపరమైన అంశాలు అన్నీ కూడా ఈ ప్రాథమిక నిబంధనకు లోబడే ఉంటాయి. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు’’ అని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ యాత్రను భౌతికంగా గానీ, లాంఛన ప్రాయంగా గానీ.. ఏ రూపంలోనూ నిర్వహించడం తగదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాంవడ్‌ యాత్ర నిర్ణయంపై యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు పునరాలోచించాలని సూచించింది. లేదంటే తామే బలవంతంగా ఆదేశాలివ్వాల్సి వస్తుందని స్పష్టం చేసింది. యాత్రపై తమ నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం వచ్చే సోమవారం లోగా కోర్టుకు తెలియజేయాలని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను జులై 19వ తేదీకి వాయిదా వేసింది.

అంతకుముందు కేంద్రం కూడా దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేసింది. కాంవడ్‌ యాత్రకు రాష్ట్రాలు అనుమతులు ఇవ్వకూడదని కేంద్రం అభిప్రాయపడింది. అయితే సంప్రదాయాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ట్యాంకర్ల ద్వారా గంగా జలాన్ని తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేయాలని, ఆ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని