Supreme Court: డబ్బుపై దురాశతోనే అవినీతి రోగం వ్యాప్తి: సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

డబ్బు సంపాదనపై దురాశే అవినీతిని ప్రోత్సహిస్తూ క్యాన్సర్‌గా వృద్ధి చెందడానికి దోహదపడుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 04 Mar 2023 09:18 IST

దిల్లీ: డబ్బు సంపాదనపై దురాశే అవినీతిని ప్రోత్సహిస్తూ క్యాన్సర్‌గా వృద్ధి చెందడానికి దోహదపడుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏమాత్రం సహించకూడదని.. దేశ ప్రజల తరఫున బాధ్యతగా ఉంటూ ఆ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. రాజ్యాంగ పీఠిక హామీ ఇచ్చినట్లుగా ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడంలో అవినీతి అనే జబ్బు తీవ్ర అవరోధంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘సంపద అందరికీ సమానంగా పంపిణీ జరగాలనే రాజ్యాంగ పీఠిక హామీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన అవరోధం మాత్రం అవినీతే. ఈ అవినీతి రోగం పాలనా రంగానికే పరిమితం కాలేదు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో రూపంలో భాగమైందని పౌరులే చెప్పే స్థాయికి చేరింది’ అని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.  ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా వ్యవహరించిన అమన్‌ కుమార్‌ సింగ్‌, ఆయన భార్యపై 2020 ఫిబ్రవరిలో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం.. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది.  దీంతో అమన్‌ సింగ్‌ను, ఆయన భార్య యస్మీన్‌ సింగ్‌ను మళ్లీ విచారించేందుకు వీలుకలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని